గుణశేఖర్ కొంపముంచిన ‘అసూయ’


రాజమౌళి మగధీర, ఈగ, బాహుబలి లాంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశాక చాలామంది దర్శకులకు అలాంటి భారీ చిత్రాలు తీయాలని కోరిక పుట్టింది. కానీ రాజమౌళిలా ఇంకెవ్వరూ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయారు. తమిళంలో బాహుబలి తరహాలో ‘సంఘమిత్ర’ అనే సినిమాను మొదలుపెట్టి కోట్లు ఖర్చు పెట్టి ప్రి ప్రొడక్షన్ చేసి ఆ ప్రాజెక్టును మొదలుపెట్టకుండానే ఆపేశారు. తర్వాత మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ తీస్తే అది తమిళనాడు అవతల ఏమాత్రం వర్కవుట్ కాలేదు.

హిందీ, మలయాళంలోనూ ఇలాంటి భారీ ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏవీ కూడా ఆశించిన పలితాన్నివ్వలేదు. రాజమౌళిని చూసి అసూయ చెందిన వాళ్లలో సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ సైతం ఉన్నాడట. ఆయన రుద్రమదేవి, శాకుంతలం లాంటి భారీ చిత్రాలు తీయడానికి రాజమౌళి మీద ఉన్న అసూయే కారణం అంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం.

“రాజమౌళి మగధీర తీసిన వెంటనే నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఈర్ష్య, అసూయ.. ఇలా అన్ని ఫీలింగ్స్ వచ్చేశాయి. కొన్ని రోజులకు అతను చేసే క్యాల్కులేటెడ్ రిస్క్‌లు మనం కూడా చేయాలనే నిర్ణయానికి వచ్చాను. అలా నేను కూడా రిస్క్ చేస్తున్నాను” అని ‘శాకుంతలం’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గుణశేఖర్ వ్యాఖ్యానించాడు. రాజమౌళిని చూసి అసూయ చెందానంటూ గుణ పాజిటివ్ సెన్స్‌లోనే వ్యాఖ్యానించినప్పటికీ.. ఆ అసూయ ఇప్పుడు ఆయన కొంప ముంచేలా ఉంది. రాజమౌళిని చూసి అసూయ చెంది ‘రుద్రమదేవి’ని అప్పట్లోనే ఏకంగా రూ.70 కోట్ల దాకా బడ్జెట్ పెట్టి తీశాడు గుణ. ఆయన ఆయన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన చిత్రం కావడం గమనార్హం.

ఐతే సినిమాలో విషయం ఉండటం, ప్రేక్షకుల్లో కూడా గుణశేఖర్ పట్ల ఒక సానుకూల వైఖరి ఉండటం వల్ల అది బాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కవుట్ అయింది. అది ఆడింది కదా అని అలాగే భారీ బడ్జెట్ పెట్టి ‘శాకుంతలం’ రూపంలో మరో సాహసోపేత చిత్రం తీశాడు గుణ. కానీ ఇది తేడా కొట్టేసింది. ఈ సినిమా గుణశేఖర్‌కు, దిల్ రాజుకు భారీ నష్టాలే తెచ్చిపెట్టేలా ఉంది. తన బలాన్ని నమ్ముకోకుండా.. రాజమౌళిని చూసి అసూయతో ‘శాకుంతలం’ తీసి ఇప్పుడు తల బొప్పి కట్టించుకుంటున్నాడు.