భారతీయ ఓటిటిలకు జియో గండం

Jio Studios
Jio Studios

3G సాంకేతికత ఉన్నప్పుడు ఒక జిబి డేటా కోసమే కనీసం వంద రూపాయలు ఖర్చు పెట్టే రోజుల నుంచి రోజుకో రెండు జిబి వాడినా నెల మొత్తం మూడు వందల్లోపే అయ్యే సౌలభ్యం తీసుకొచ్చింది జియోనే. 4జి లాంచ్ తో టెలికాం రంగంలో పెను విప్లవం సృష్టించిన ముఖేష్ అంబానీ ఇప్పుడు ఓటిటిని విస్తరించే పనిలో పడ్డారు.

ఇటీవలే ముంబైలో జియో స్టూడియోస్ ఒక గ్రాండ్ ఈవెంట్ జరిపింది. త్వరలో తమ ప్లాట్ ఫార్మ్ మీద విడుదల కాబోయే 100 సినిమాలు, వెబ్ సిరీస్ ల టైటిళ్ళను ఓ ట్రైలర్ రూపంలో రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది. ఎందుకంటే అందులో చాలా క్రేజీ కంటెంట్ ఉంది.

కనీసం పదిహేను వందల కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనాలున్న షారుఖ్ ఖాన్ డుంకీని జియోనే కొనుగోలు చేసింది. బాలీవుడ్ స్టార్లు నటించిన భారీ చిత్రాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవలే ఐపీఎల్ 2023ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేసి హాట్ స్టార్ లాంటి పోటీదారులకు ఝలక్ ఇచ్చిన జియో రాబోయే రోజుల్లో కొత్త సినిమాలను సైతం ఇలా ఉచితంగా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. ముందు జనానికి బాగా అలవాటు చేసి వాడకుండా ఉండలేని పరిస్థితి తీసుకొచ్చాక అప్పుడు మెల్లగా డబ్బులు తీసుకోవడం ముందు నుంచి అనుసరిస్తున్న ఎత్తుగడే

రాబోయే రోజుల్లో ఇండియాలో ఓటిటిలకు జియో గండం తప్పేలా లేదు. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్, హాట్ స్టార్ లాంటి వాటికీ భారీగా ఉన్న చందాదారులను ఇటువైపు తిప్పుకునే పనిని జియో త్వరలో మొదలుపెట్టనుంది. ప్రస్తుతానికి బాలీవుడ్ తో మొదలుపెట్టి మెల్లగా రీజనల్ మార్కెట్ వైపు దృష్టి పెట్టనుంది. అదే జరిగితే ముఖేష్ అంబానీ తీసుకురాబోయే విప్లవాత్మక మార్పులు భారీగా ఉండబోతున్నాయి. అసలే చిన్న సినిమాలకు జనం థియేటర్లకు కష్టమైపోతున్న తరుణంలో ఇప్పుడు జియో స్టూడియోస్ ప్రణాళికలు చూస్తుంటే పెద్ద గండమే ఎదురయ్యేలా ఉంది