తారక్-త్రివిక్రమ్.. రూమర్లకు చెక్


టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌, మన టాప్ డైరెక్టర్లలో ఒకడైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల మధ్య మంచి అనుబంధమే ఉందని.. ‘అరవింద సమేత’ సినిమా చేస్తున్న సమయంలో అందరికీ తెలిసింది. తాము ఎంత సన్నిహితులమో ఎన్టీఆర్ స్వయంగా ఆ సందర్భంలో చెప్పుకున్నాడు. తాను త్రివిక్రమ్‌ను ‘స్వామీ’ అని పిలుస్తానని కూడా తెలిపాడు. త్రివిక్రమ్ సైతం.. ఎన్టీఆర్ గురించి ఆ సినిమా టైంలో చాలా గొప్పగా మాట్లాడాడు.

ఈ అనుబంధానికి తోడు ‘అరవింద సమేత’ మంచి విజయం సాధించడంతో వీరి కలయికలో ఇంకో సినిమాకు సన్నాహాలు జరిగాయి. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. అనౌన్స్‌మెంట్ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. తారక్, త్రివిక్రమ్ మధ్య ఏవో అభిప్రాయ భేదాలు తలెత్తాయని.. దీంతో సినిమా ఆగిపోయిందని.. తర్వాత ఇద్దరి మధ్య మాటలు కూడా కరువయ్యాయని అప్పట్లో గట్టి ప్రచారమే జరిగింది.

దీనికి తగ్గట్లే తర్వాత ఏ సందర్భంలోనూ తారక్, త్రివిక్రమ్ కలిసి కనిపించకపోవడం సందేహాలను మరింత పెంచింది. కానీ తాజాగా ఈ ప్రచారానికి తెరదించుతూ తారక్, త్రివిక్రమ్ కలిశారు. ఇటీవలే అమేజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్‌కు ఎన్టీఆర్ ఇచ్చిన స్పెషల్ పార్టీలో త్రివిక్రమ్ తళుక్కుమన్నాడు. ఈ పార్టీకి ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులనే తారక్ పిలిచాడు. రాజమౌళి సహా పలువురు హాజరైన ఈ పార్టీలో త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. ఈ స్పెషల్ పార్టీకి త్రివిక్రమ్‌ను పిలిచాడు అంటే.. తారక్‌కు ఆయనతో ఎలాంటి విభేదాలు లేనట్లే.

కథల విషయంలో అభిప్రాయాలు కలవక ఆగిపోయే సినిమాలు చాలానే ఉంటాయి. అంత మాత్రాన వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని అనుకోకూడదు. తారక్, త్రివిక్రమ్ విషయంలోనూ అదే జరిగిందన్నది స్పష్టం. భవిష్యత్తులో ఈ ఇద్దరూ కలిసి ఇంకో సినిమా చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రస్తుతం తారక్ కొరటాల సినిమాలో నటిస్తుంటే.. త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలో బిజీగా ఉన్నాడు.