బిజినెస్ తెచ్చిపెట్టిన లారెన్స్ మాస్ ఇమేజ్

తమిళనాటే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా మాస్ లో లారెన్స్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. బెనిఫిట్ షోలేసేంత రేంజ్ కాదు కానీ మంచి ఓపెనింగ్స్ ఇచ్చే ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు. ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న రుద్రుడు మీద సాధారణ ప్రేక్షకుల్లో ఏమంత అంచనాలు లేవు. పైగా ట్రైలర్ చూశాక ఇదేదో రొటీన్ కంటెంట్ లా ఉందని ఫీలైనవాళ్ళే ఎక్కువ. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు కానీ అది కూడా పెద్దగా హైలెట్ కాలేకపోయింది. ఇన్ని ప్రతికూలతలున్నా సరే రుద్రుడు బిజినెస్ మాత్రం నిక్షేపంగా జరిగిపోతోందని ట్రేడ్ వర్గాల టాక్.

ఏపీ తెలంగాణకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను ఏడు కోట్ల దాకా విక్రయించారట. దీన్ని బట్టి లారెన్స్ బ్రాండ్ ఎంతగా పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. అంటే దీనిపైన ఇంకో యాభై లక్షలు అదనంగా షేర్ వస్తేనే బయ్యర్లు సేఫ్ అవుతారు. కనీసం హిట్ టాక్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఎంత రెగ్యులర్ గా ఉన్నా సరే లారెన్స్ సినిమాలు బాగా పే చేసిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు కాంచన 3కి నెగటివ్ రివ్యూలు హోరెత్తిపోతే రెండు వారాలు తిరక్కుండానే బీసీ సెంటర్ల సహాయంతో సులభంగా లాభాలు తెచ్చేసుకుంది.

ఇప్పుడు రుద్రుడుకి అదే జరుగుతుందని డిస్ట్రిబ్యూటర్లు నమ్ముతున్నారు. శాకుంతలం పోటీ ఉన్నప్పటికి అది మాస్ కి అప్పీల్ అయ్యే ఛాన్స్ తక్కువ కాబట్టి మాదాన్నే చూస్తారనే ధీమా లారెన్స్ నిర్మాతల్లో కనిపిస్తోంది. వెట్రిమారన్ విడుదల పార్ట్ 1 కూడా రేస్ లో ఉంది కానీ దాన్ని మరీ అంత సీరియస్ గా పరిగణించడం లేదు. కదిరేశన్ దర్శకత్వం వహించిన రుద్రుడులో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా శరత్ కుమార్ విలన్ గా చేశారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఎప్పటిలాగే లారెన్స్ మాస్ తో గట్టెక్కుతాడా లేదానేది 14న తేలిపోతుంది.