మూడు భాష‌ల్లో స‌మంత సాహ‌సం

కెరీర్లో చాలా ఏళ్లు చిన్మ‌యి వాయిస్‌తోనే బండి న‌డిపించింది స‌మంత‌. ఆమెకు కెరీర్లో ఎద‌గ‌డానికి చిన్మ‌యితో చెప్పించుకున్న డ‌బ్బింగ్ ఒక ముఖ్య కార‌ణం అన‌డంలో సందేహం లేదు. తెలుగులో త‌న తొలి చిత్రం ఏమాయ చేసావె చూసి ప్రేక్ష‌కులు మైమ‌రిచిపోవ‌డంలో చిన్మ‌యి డ‌బ్బింగ్ కీల‌కం అయింది.

ఐతే తెలుగులోనే వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. ఇక్క‌డే నివాసం ఉంటూ తెలుగు మీద ప‌ట్టు సంపాదించిన సామ్.. కొన్నేళ్ల నుంచి త‌నే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఐతే మామూలు సినిమాలంటే ఓకే కానీ.. శాకుంత‌లం లాంటి పౌరాణిక చిత్రంలో గ్రాంథిక డైలాగుల‌ను కూడా స‌మంతే చెప్ప‌డం పట్ల భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. సినిమాకు ఇది మైన‌స్ అవుతుందేమో అన్న చ‌ర్చ కూడా న‌డిచింది. కానీ స‌మంత వెనుకంజ వేయ‌లేదు. టీజ‌ర్, ట్రైల‌ర్ల‌లోనే కాదు పూర్తి సినిమాలోనూ త‌నే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంది.

విశేషం ఏంటంటే.. స‌మంత వాయిస్ తెలుగులో మాత్ర‌మే కాదు.. హిందీ, త‌మిళంలోనూ వినిపించ‌బోతోంది. స‌మంత బేసిగ్గా త‌మిళ అమ్మాయే అన్న సంగ‌తి తెలిసిందే. కాబ‌ట్టి తెలుగులో చెప్పాక త‌మిళంలో కూడా డ‌బ్బింగ్ చెప్ప‌డానికి వెనుకాడి ఉండ‌దు. ఐతే హిందీ మీద పెద్ద‌గా ప‌ట్టు లేక‌పోయినా.. క‌ష్ట‌ప‌డి ఆ భాష‌లో కూడా త‌న పాత్ర‌కు సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంది సామ్.

ఐతే ఇదంతా తేలిక‌గా ఏమీ జ‌ర‌గ‌లేద‌ని అంటోందామె. వేర్వేరు భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని. మిగ‌తా న‌టీన‌టులు ఈ ప‌ని ఎలా చేస్తారో తెలియ‌దు. నేను మాత్రం చాలా క‌ష్ట‌ప‌డ్డా. చాలాసార్లు రిహార్స‌ల్స్ చేసుకుని త‌ర్వాత డ‌బ్బింగ్ చెప్పాల్సి వ‌చ్చింది. ఐతే నేను స‌రిగ్గానే డైలాగులు చెప్పాన‌ని అనుకుంటున్నా. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా అని స‌మంత పేర్కొంది. గుణ‌శేఖ‌ర్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 14న ఐదు భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.