రెడ్ రీమేక్ బోల్తా కొట్టేసింది

మూడేళ్ళ క్రితం ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన రెడ్ గుర్తుందిగా. ఏదో పర్వాలేదనిపించుకుంది కానీ ఇస్మార్ట్ శంకర్ ని మించిన బ్లాక్ బస్టర్ ని ఆశించిన అభిమానులకు కమర్షియల్ గా నిరాశనే మిగిల్చింది. ఇది సాహో విలన్ అరుణ్ విజయ్ తమిళంలో చేసిన సూపర్ హిట్ తడంకి రీమేక్. దీన్ని తాజాగా హిందీలో రీమేక్ చేసి గుంరాహ్ గా నిన్న థియేటర్లలో వదిలారు. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా సీతారామం భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక్కడ ఇన్స్ పెక్టర్ గా నివేత థామస్ చేసిన క్యారెక్టర్. నేషనల్ హాలిడే ఉన్నప్పటికీ కేవలం కోటి రూపాయల ఓపెనింగ్ రావడం షాక్.

ఇంతకీ సినిమా ఎలా ఉందంటే కొత్త దర్శకుడు వర్ధన్ కేట్కర్ దీన్ని తెరకెక్కించారు. ఒక హత్య కేసులో అచ్చుగుద్దినట్టు ఒకే పోలికలో ఉన్న ఇద్దరు అనుమానితులు పోలీసులకు దొరికితే వాళ్లలో అసలు దోషి ఎవరో పట్టుకోవడాన్ని సవాల్ గా తీసుకుంటుంది డిపార్ట్ మెంట్. అయితే సాక్ష్యాలు ఏవీ బలంగా లేకపోవడంతో పాటు ఆ కవలల తెలివితేటలు సులభంగా బయటికి వచ్చేలా చేస్తాయి. నిజంగా ఆ మర్డర్ చేసిందెవరనే పాయింట్ మీద సాగుతుంది. రామ్ పెర్ఫార్మన్స్ తో పాటు తిరుమల కిషోర్ టేకింగ్, పాటలు రెడ్ ని ఓసారి చూడొచ్చనేలా తీర్చిదిద్దాయి.

కానీ గుంరాహ్ అలా లేదు. స్క్రీన్ ప్లే విషయంలో వర్ధన్ సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో సన్నివేశాల కన్నా ఎక్కువ ఆదిత్య రాయ్ కపూర్ ఓవరాక్టింగ్ డామినేట్ చేసింది. దీంతో థ్రిల్లర్ బదులు ఏదో కమర్షియల్ మాస్ మసాలా సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పాటలు పెద్ద మైనస్ గా నిలిచాయి. పెద్ద క్యాచీగా లేవు. ట్విస్ట్ ఏంటంటే తడం, రెడ్ రెండు హిందీ డబ్బింగ్ వెర్షన్లను యూట్యూబ్ లో మిలియన్ల ప్రేక్షకులు ఉచితంగా ఎప్పుడో చూశారు. తాపీగా ఇప్పుడు ఇమేజ్ లేని ఆదిత్య రాయ్ తో చూడమంటే ఎవరికి ఆసక్తి ఉంటుంది. మొత్తానికి మన రెడ్ ని అక్కడ బ్లాక్ చేశారు.