నంది అవార్డుల‌పై పోసాని వ్యాఖ్య‌ల దుమారం

Posani

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్ర‌చారం చేసి.. ఈ మ‌ధ్యే ఏపీ ఫిలిం డెవ‌లప్మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌విని అందుకున్నాడు సినీ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి. తాజాగా ఏపీ ఫైబ‌ర్ నెట్ ఆధ్వ‌ర్యంలో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో కార్య‌క్ర‌మం ఆరంభమైన సంద‌ర్భంగా పోసాని చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. నంది అవార్డుల గురించి ఆయ‌న కొంచెం తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. అవార్డులు కులం, మతం చూసి ఇవ్వ‌కూడ‌ద‌ని.. కానీ ఏపీలో ఒక‌ప్పుడు కులం ఆధారంగా అవార్డులు ఇచ్చార‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంను ఉద్దేశించే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

నంది అవార్డుల‌పై అనేక అపోహ‌లు ఉన్నాయ‌ని.. గ్రూపులు, కులాల వారీగా ఈ అవార్డుల‌ను పంచుకుంటార‌ని.. చంద్ర‌బాబు హ‌యాంలో ఇదే జ‌రిగింద‌ని పోసాని ఆరోపించారు. క‌ర్మ కాలి త‌న‌కు టెంప‌ర్ సినిమాకు గాను నంది అవార్డు ఇచ్చార‌ని.. వేరే ఆప్ష‌న్ లేకే త‌న‌ను ఆ అవార్డుకు ఎంపిక చేశార‌ని.. తాను కూడా త‌ప్ప‌క తీసుకున్నాన‌ని పోసాని అన్నారు. ఎవ‌రెవ‌రు అవార్డులు తీసుకున్నారో చూశాన‌ని.. అవార్డుల ఎంపిక క‌మిటీలో 11 మంది ఒక వ‌ర్గం వారే ఉన్నార‌ని.. అక్క‌డి ప‌ద్ధ‌తి న‌చ్చ‌క‌ త‌న‌కు అవార్డు వ‌ద్ద‌ని కూడా చెప్పాన‌ని పోసాని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్లో దుమారం రేగింది.

పోసాని వ్యాఖ్య‌ల‌ను తెలుగు నిర్మాత‌ల మండ‌లి కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న కుమార్ ఖండించారు. పోసాని పార్టీ ప‌రంగా ఈ వ్యాఖ్య‌లు చేసి ఉండొచ్చ‌ని.. నంది అవార్డుల ఎంపిక ఎప్పుడూ పార‌దర్శ‌కంగానే జ‌రుగుతుంద‌ని.. పోసానికి అవార్డు వ‌చ్చిందంటే ఆయ‌న న‌ట‌న మెచ్చి ఇచ్చార‌ని.. అప్పుడు అవార్డుల క‌మిటీలో జీవిత రాజ‌శేఖ‌ర్ ఉన్నార‌ని.. అలాగే ఎంత‌మాత్రం కులం చూడ‌ని, క‌మ్యూనిస్టులు అయిన ప‌రుచూరి సోద‌రులు ఉన్నార‌ని.. ఇలాంటి వాళ్ల గురించి పోసాని ఎలా వ్యాఖ్యానిస్తార‌ని ప్ర‌స‌న్న కుమార్ ప్ర‌శ్నించారు. పోసాని వ్యాఖ్య‌ల‌పై మాజీ ఎంపీ, సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ కూడా మండిప‌డ్డారు. ఇండ‌స్ట్రీలోకి అన‌వ‌స‌రంగా కులం తీసుకు వ‌స్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.