రంగా రంగా మరీ ఇంత త్వరగానా

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తన కెరీర్ లో దేనికి చేసుకోనంత మార్కెటింగ్ మార్చి 22న విడుదలైన రంగమార్తాండకు జరిపారన్నది కాదనలేని వాస్తవం. సెలబ్రిటీలను తీసుకొచ్చి వరసగా షోలు వేసి వాళ్ళతో వీడియో బైట్లు తీసుకుని పబ్లిసిటీ చేసుకున్నారు. సోషల్ మీడియా ప్రముఖులను పిలిపించి వాళ్ళ ద్వారా పోస్టులు ట్వీట్లు వైరల్ చేయించారు. అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. సినిమా అద్భుతంగా ఉందని గొప్పగా పొగిడారు. కొందరు ఏకంగా కెమెరాల ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. బరువైన భావోద్వేగాలను నిజంగానే చాలా మందిని కదిలించిన మాట వాస్తవం.

ఇదంతా చూశాక ఆడియన్స్ థియేటర్లకొచ్చి చూస్తారని కృష్ణవంశీతో పాటు అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. ఆన్ లైన్ లో జరిగిన ప్రచారానికి బాక్సాఫీస్ వద్ద నమోదైన కలెక్షన్లను పొంతన కుదరలేదు. మొదటి రెండు మూడు రోజులు కొంత హడావిడి కనిపించినా ఆ తర్వాత హఠాత్తుగా పడిపోయింది. పోటీగా ఉన్న దాస్ కా ధమ్కీ సైతం యావరేజ్ గా నిలిచినప్పటికీ అదేమీ రంగమార్తాండకు ఉపయోగపడలేదు. కేట్ చేస్తే రెండు వారాలు దాటడం ఆలస్యం నిన్న అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో రంగమార్తాండ స్ట్రీమింగ్ మొదలుపెట్టేసింది.

ఒకరకంగా పధ్నాలుగు రోజులకే ఇలా ఓటిటిలో వదిలేయడం మంచి నిర్ణయమే. అధిక శాతం ప్రేక్షకులు చూసేందుకు అవకాశం ఉంటుంది. ఆసక్తి తగ్గిపోయేదాకా లేట్ చేయడం కంటే ఇదే ఉత్తమం. బడ్జెట్ వసూళ్లు లెక్కలు గట్రా ఎలా ఉన్నా ప్రైమ్ రంగమార్తాండకు దాని మార్కెట్ కి మించిన భారీ మొత్తాన్నే ఆఫర్ చేసి హక్కులు కొనుగోలు చేసిందట. కాకపోతే థియేటర్ రిలీజ్ కంపల్సరీ అనే కండీషన్ పెట్టడం వల్లే వర్కౌట్ కాదని అనిపించినా కృష్ణవంశీ రిస్క్ చేశారని ఇన్ సైడ్ టాక్. ఉరుము లేని పిడుగులా ఈ మధ్య ఓటిటి రిలీజులు ఇలా ట్విస్ట్ ఇస్తున్నాయి.