30 సంవత్సరాల తర్వాత ఖాన్ల మల్టీస్టారర్

అతి పెద్ద బాలీవుడ్ స్టార్ హీరోలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలన్నది ఎందరో మూవీ లవర్స్ కల. పఠాన్ లో ఓ పది నిమిషాల ఎపిసోడ్ కే థియేటర్లు ఊగిపోయాయి. కేవలం ఈ ట్రాక్ కోసమే రిపీట్ చూసిన ఫ్యాన్స్ ఉన్నారని ట్రేడ్ పండితులు చెబుతుంటారు. అలాంటిది రెండున్నర గంటలపాటు ఇద్దరు ఖాన్స్ తెరమీద కలపడుతూ కనపడితే అంతకన్నా సంబరం ఇంకేముంటుంది. దాన్ని నిజం చేస్తామంటున్నారు యష్ రాజ్ ఫిలింస్ అధినేతలు. అది కూడా టైగర్ VS పఠాన్ టైటిల్ తో.

రోజుకో షాక్ న్యూస్ ఇస్తున్న నిర్మాత ఆదిత్య చోప్రా ఇవాళ ఈ వార్తను వదిలారు. షారుఖ్ సల్మాన్ కలిసి నటించిన ఫుల్ లెన్త్ మూవీ 1995లో వచ్చిన కరణ్ అర్జున్. పునర్జన్మల నేపథ్యంలో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన ఈ రివెంజ్ డ్రామా అప్పట్లో పెద్ద హిట్టు. జాతీ హూ మై పాట ఊరు వాడా మ్రోగిపోయింది. ఇద్దరు హీరోల ట్రెండ్ ని కొత్త మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ ఇది. ఆ తర్వాత ఎందరు ట్రై చేసినా ఈ కలయిక సాధ్యపడలేదు. ఎవరి మార్కెట్ వాళ్లకు విస్తృతంగా పెరిగిపోవడంతో పూర్తి నిడివి సినిమాలో చూపించే సాహసం ఎవరూ చేయలేకపోయారు.

పఠాన్ పుణ్యమాని మళ్ళీ మూడు దశాబ్దాల తర్వాత అది నెరవేరబోతోంది. దీనికి సిద్దార్థ్ ఆనందే దర్శకత్వం వహించబోతున్నాడు. రాబోయే అయిదేళ్లలో వీలైనన్ని స్పై(గూఢచారి) సినిమాలు తీయాలని యష్ బ్యానర్ ఫిక్స్ అయ్యింది. కాంబినేషన్లు బడ్జెట్లు సిద్ధం చేస్తోంది. టైగర్ vs పఠాన్ షూటింగ్ 2024లో మొదలై ఆపై ఏడాది 2025లో రిలీజవుతుంది. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 ఎప్పటి నుంచనే క్లారిటీ ఇంకా అఫీషియల్ గా రావాల్సి ఉంది. ఇంత లేట్ ఏజ్ లో ఖాన్ల ద్వయం తెరమీద ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో ఇంకో రెండేళ్లు ఆగి చూడాలి.