మళ్ళీ మిరపకాయ్ కాంబో?

టాలీవుడ్లో మంచి క్రేజున్న కాంబినేషన్లలో మాస్ రాజా రవితేజ, హరీష్ శంకర్‌లది ఒకటి. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘షాక్’ పెద్ద షాకిచ్చినా.. రెండో చిత్రం ‘మిరపకాయ్’ మాత్రం మంచి ఫలితాన్నందించింది. అప్పట్లో రవితేజకు పెద్ద హిట్‌ను అందించింది. హరీష్ శంకర్‌ కెరీర్‌కు కూడా ఈ సినిమా బాగా ఉపయోగపడింది. ఐతే ఈ ఇద్దరు మిత్రులు కలిసి మళ్లీ సినిమానే చేయలేదు. మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగినా వర్కవుట్ కాలేదు.

ఐతే త్వరలో మళ్లీ వీరి కలయికలో సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు కోసం చాలా సమయం వెచ్చించాడు హరీష్. ఆ చిత్రం ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లబోతోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి.. ఆ తర్వాత వరుసగా కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కించాలని హరీష్ భావిస్తున్నాడు.

పవన్ సినిమా కోసం చేస్తున్న ప్రయాణంలో మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలతో హరీష్ బాగా క్లోజ్ అయ్యాడు. అదే బేనర్లో అతను ఇంకో రెండు సినిమాలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ముందుగా రవితేజతో సినిమా ఉంటుందట. మాస్ రాజా.. మైత్రీ బేనర్లో చేసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పెద్ద డిజాస్టర్ అయింది. ఆ నష్టం పూడ్చేందుకు మరో సినిమా చేస్తానని అప్పట్లోనే మాట ఇచ్చాడట.

హరీష్‌కు కూడా మైత్రీ వాళ్లతో కమిట్మెంట్లు ఉండటంతో ఇద్దరూ కలిసి ఈ బేనర్లో వచ్చే ఏడాది సినిమా చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ కొత్త సినిమా ‘రావణాసుర’ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. ‘టైగర్ నాగేశ్వరరావు’ సహా కొన్ని ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. మూణ్నాలుగు నెలలకో సినిమా లాగించేస్తాడు కాబట్టి.. హరీష్ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రవితేజ అతడితో సినిమాను పట్టాలెక్కించే అవకాశముంది.