దిల్ రాజుకి కొత్త ఇరకాటం

అగ్ర నిర్మాణ సంస్థని నడపడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చూసుకునే దిల్ రాజు గారికి సంక్రాంతి వ్యవహారం ఎంత తలనెప్పి అయ్యిందో చూశాం. పోటీ కారణంగా వారసుడుని మూడు రోజులు ఆలస్యంగా విడుదల చేయాల్సి వచ్చింది. సరే ఇండస్ట్రీ అన్నాక సర్దుబాట్లు సహజమే కానీ కలివిడిగా ఉంటూ ఇండస్ట్రీ కోసం ఆలోచించే తనను కావాలనే కొందరు టార్గెట్ చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన దిల్ రాజుకు వచ్చే నెలాఖరున కొత్త ఇరకాటం వచ్చేలా ఉంది. ఏప్రిల్ 28 రిలీజ్ కాబోతున్న పొన్నియిన్ సెల్వన్ 2 తెలుగు వెర్షన్ ని ఆయన పంపిణి చేస్తున్న సంగతి తెలిసిందే.

అదే రోజు అఖిల్ ఏజెంట్ కూడా ఉంది. అక్కినేని ఫ్యాన్స్ దీనికి భారీ ఎత్తున థియేటర్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ పీఎస్ 2 కోసం చెప్పుకోదగ్గ స్క్రీన్లు కేటాయించాల్సి ఉంటుంది. కౌంట్ కంటే క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితుల్లో ఊరికే ఇంత నెంబర్ కావాలని అభిమానులు అడగడం లేదు. ప్రేక్షకులు వచ్చేలా ప్రతి ఊరిలో టాప్ అనిపించే స్క్రీన్లు ఏజెంట్ కు ఇవ్వాలని కోరుతున్నారు. నిజానికి పిఎస్ 2 మన దగ్గర ఏమంత బజ్ లేదు. మొదటి భాగం సోసోగా ఆడటమే దీనికి కారణం. పది కోట్ల బ్రేక్ ఈవెన్ అందుకోలేకే కిందా మీద పడింది.

అలా అని ఏజెంట్ మీద ఆర్ఆర్ఆర్ రేంజ్ లో బజ్ ఉందని కాదు. నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు . అఖిలేమో సెలబ్రిటీ క్రికెట్ లీగే ప్రపంచంగా ఉన్నాడు. అదిప్పుడు పూర్తయ్యింది కాబట్టి బ్యాలన్స్ ఉన్న ఒక్క పాట చిత్రీకరణని వీలైనంత వేగంగా చేసేయాలి. అసలే ఏజెంట్ కి తమిళనాడు, కేరళలో పొన్నియన్ సెల్వన్ 2 వల్ల ఓపెనింగ్స్, రెవిన్యూకి దెబ్బ పడేలా ఉంది. ఇప్పుడు తెలుగులో అదే పీఎస్ 2 వల్ల సమస్య వస్తే దిల్ రాజుకి ఇరకాటమే. అంతకు రెండు వారాల ముందే ఆయన నిర్మించి విడుదల చేస్తున్న శాకుంతలం మీద అంచనాలున్నాయి.