అమరావతికి అటు ఇటు మధ్యలో మహేష్

మహేష్ బాబు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు అమరావతికి అటు ఇటు టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా వచ్చిన లీక్ ఫ్యాన్స్ ని ఊపేస్తోంది. గురూజీ తన రెగ్యులర్ సెంటిమెంట్ ని విడిచిపెట్టకుండా అ అక్షరంతో మొదలయ్యేలా మళ్ళీ జాగ్రత్త పడ్డారని అర్థమవుతోంది. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఖరారు చేసినట్టుగా వినికిడి. అయితే ఈ పేరు వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉందట. గుంటూరు బ్యాక్ డ్రాప్ గా అమరావతికి చెరో వైపున హీరోకు సంబంధం ఉన్న ఊళ్ళలో ఉండే రెండు కుటుంబాల కథగా దీన్ని తీర్చిదిద్దినట్టు వినికిడి .

ఆ ఫ్యామిలీస్ మధ్య ఉన్న వైరాన్ని తీర్చడంతో పాటు ఒక ప్రత్యేకమైన సంకల్పంతో అక్కడికి వచ్చిన మహేష్ ఏమేం చేశాడన్నదే చిత్ర కథగా చెబుతున్నారు. లైన్ పరంగా చూసుకుంటే కొత్తదనం లేదు కానీ త్రివిక్రమ్ మార్కు ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా దట్టించడంతో పాటు అతడు స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బలంగా ఉంటాయట. కాకపోతే నగర నేపథ్యం ఎక్కువగా ఉండదు కాబట్టి విలేజ్ లోనే కావాల్సినంత వినోదాన్ని సెట్ చేసినట్టుగా తెలిసింది. అయితే ఏపీలో నలుగుతున్న రాజధాని వివాదానికి దీనికి ఎలాంటి సంబంధం లేదనేది వాస్తవం.

విడుదల తేదీ ఖరారు చేసే పని ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆగస్ట్ 11న రావడం అనుమానమే. 2024 సంక్రాంతికి వెళ్లడం ఖాయమనే సంకేతాలు వస్తన్నాయి. ఒకవేళ ప్రభాస్ ప్రాజెక్ట్ కె, రామ్ చరణ్ సీఈఓ, బన్నీ పుష్ప 2లు వచ్చినా రాకపోయినా జనవరి 12న అమరావతికి అటుఇటుని దించాలని నిర్మాత నాగ వంశీ ఆలోచిస్తున్నట్టుగా టాక్ ఉంది. ఒకవేళ వద్దనుకుంటే మాత్రం ఈ ఏడాది దసరా లేదా దీపావళిని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇంతకన్నా ఆప్షన్లు లేవు. అల వైకుంఠపురములో తరహాలో హీరో మీద కాకుండా టైటిల్ ని సబ్జెక్టు మీద పెట్టడంలో త్రివిక్రమ్ మరోసారి తన మార్కు చూపించారు.