అక్టోబర్ వద్దంటున్న మహేష్ ఫ్యాన్స్

అనుకుంటాం కానీ ఇండస్ట్రీలో ఉన్నన్ని సెంటిమెంట్లు ఇంకెక్కడా ఉండవేమో. కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరిగినా వాటి మధ్య ఉన్న సంబంధం ఎన్నో అనుమానాలు రేకెత్తించి భయపడేలా చేస్తుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఆగస్ట్ 11 విడుదలవుతుందా లేదానే దాని మీద ఎలాంటి క్లారిటీ రావడం లేదు. నిన్న ఉగాది పండగ సందర్భంగా టైటిల్ కాకపోయినా కనీసం రిలీజ్ డేట్ కి సంబంధించి మరోసారి ఏదైనా కన్ఫర్మేషన్ వస్తుందేమోనని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ అదేమీ జరగలేదు.

సోషల్ మీడియా ట్రెండింగ్ దెబ్బకు త్వరలో అప్ డేట్స్ ఉంటాయని మొన్న ట్వీట్ చేయడం తప్పించి ఇంకేమి చెప్పలేదు. ఈలోగా చిరంజీవి భోళాశంకర్ అదే తేదీని లాక్ చేసుకుని అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. అనిమల్, గదర్ 2, జైలర్ ఇలా ఆ వారంలో చాలా పెద్ద పోటీనే ఉంది. అందుకే మహేష్ 28ని అక్టోబర్ లో దసరా పండగ సందర్భంగా తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో టీమ్ ఉన్నట్టు వినికిడి. అయితే మహేష్ మాత్రం ఆ సీజన్ మీద ఏమంత ఆసక్తి చూపించడం లేదట. ఇదే కాంబోలో రూపొందిన ఖలేజా ఆ టైంలోనే వచ్చి ఫ్లాప్ మూటగట్టుకోవాల్సి వచ్చింది

ఇదొక్కటే కాదు బాబీ , అతిథి, వంశీ ఇదే నెలలో రిలీజై సూపర్ డిజాస్టర్స్ గా నిలిచాయి. సో రకంగా అక్టోబర్ ఏ మాత్రం అచ్చిరాని నెలగా ఫీలవుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. త్రివిక్రం బృందం మాత్రం ఇంకా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. 2024 సంక్రాంతి ఆప్షన్ ఉన్నప్పటికీ ప్రభాస్ ప్రాజెక్ట్ కె, రామ్ చరణ్ సిఈఓలు ఉన్న నేపథ్యంలో వాటితో తలపడి ఓపెనింగ్స్ ని పరస్పరం దెబ్బ తీసుకోవడం కంటే ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉందేమో చూస్తున్నారట. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు