రమ్యకృష్ణ వద్దన్నా వినిపించుకోని కృష్ణవంశీ


పెళ్లి తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమానే చేయలేదు రమ్యకృష్ణ. ఆమె క్యామియో రోల్ చేసిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమా కృష్ణవంశీతో వివాహం తర్వాతే రిలీజైనప్పటికీ.. ఇది కూడా పెళ్లికి ముందు ఒప్పుకున్న సినిమానే. ఎట్టకేలకు ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగమార్తాండ’లో రమ్య కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె పాత్ర.. తన నటన గురించి కృష్ణవంశీ చాలా గొప్పగా చెబుతున్నాడు.

ఐతే కృష్ణవంశీ ఎంతో ఇష్టపడి, కష్టపడి తీసిన ఈ సినిమాను రమ్యకృష్ణ గట్టిగా వ్యతిరేకించిందట. ‘రంగమార్తాండ’.. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే ఒరిజినల్ చూసిన తాను.. ఇలాంటి సినిమా తీస్తే ఎవరు చూస్తారు అని కృష్ణవంశీతో అన్నానని.. అయినా సరే తన భర్త మొండిగా ఈ సినిమా చేశాడని ఆమె వెల్లడించింది.

“నట సామ్రాట్ సినిమాను కృష్ణవంశీ రీమేక్ చేయబోతున్నట్లు చెప్పడంతో ఒరిజినల్ చూశా. ఇలాంటి సీరియస్ సినిమా ఎవరు చూస్తారని అడిగా. ఆయన వినిపించుకోకుండా షూట్ మొదలుపెట్టారు. ఇందులోని ఓ పాత్ర కోసం చాలామంది హీరోయిన్లను సంప్రదించారు. ఎవరూ ఎంపిక కాకపోవడంతో ‘నేను చేస్తా’ అని చెప్పాను. ఈ పాత్ర నా స్టయిల్లో ఉండదని.. కళ్లతోనే నటించాల్సి ఉంటుందని కృష్ణవంశీ చెప్పాడు. నిజానికి నాకు సీరియస్ సినిమాలు నచ్చవు. ఎమోషనల్ సినిమాలు నేను చూడను” అని రమ్యకృష్ణ తెలిపింది.

రమ్యకృష్ణ ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్‌కు జోడీగా నటించింది. ఇది ఒక రంగస్థల నటుడిగా కథతో తెరకెక్కిన చిత్రం. మరాఠీలో నానా పటాకర్ చేసిన పాత్రను ఇక్కడ ప్రకాష్ రాజ్ చేశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా చాలా సీరియస్‌గా సాగే పాత్రను చేశాడు. ఉగాది కానుకగా బుధవారమే ‘రంగమార్తాండ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.