పొన్నియన్ సెల్వన్-2 పరిస్థితి ఘోరం

పొన్నియన్ సెల్వన్.. తమిళ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటి. ఆ సినిమాను తమిళ జనాలు గర్వకారణంగా భావించారు. ప్రతి తమిళుడూ చూసి తీరాల్సిన సినిమా అన్నట్లుగా ప్రచారం సాగింది. తమిళనాడులోనే కాక తమిళ జనాలున్న ప్రతి చోటా ఆ చిత్రం విపరీతంగా ఆడేసింది.

ఏకంగా రూ.500 కోట్ల దాకా ఆదాయం తెచ్చిపెట్టింది. కానీ తమిళ జనాలు తప్ప ఇంకెవ్వరికీ ఈ సినిమా నచ్చలేదు. తమిళ అనువాద చిత్రాల్లో విషయం ఉంటే వాటిని నెత్తిన పెట్టుకునే తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను పూర్తిగా తిరస్కరించారు. మణిరత్నంకే కాక ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన నటీనటులకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్నా సరే.. ఇక్కడ మినిమం ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయింది. ఓవరాల్‌గా తెలుగులో ఇది డిజాస్టర్ అనడంలో సందేహం లేదు.

మణిరత్నం ఇప్పుడిక ‘పొన్నియన్ సెల్వన్-2’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఏప్రిల్ 28న విడుదలకు ముస్తాబవుతోంది ‘పీఎస్-2’. తమిళనాట ఈ సినిమాకు బ్రహ్మాండమైన బిజినెస్ జరుగుతోంది. వంద కోట్లు పోసేస్తున్నారు బయ్యర్లు. కానీ తెలుగులో ఈ సినిమాను తక్కువ రేటుకు ఇస్తామన్నా కొనడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదట.

కనీసం పది కోట్ల రేటు పెట్టడానికి కూడా ఏ నిర్మాత, బయ్యర్ సాహసించట్లేదట. ‘పొన్నియన్ సెల్వన్’ను తెలుగులో రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్న దిల్ రాజు సైతం వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ‘పొన్నియన్ సెల్వన్’ థియేటర్లలోనే కాక ఓటీటీలో సైతం తెలుగు ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది.

సినిమా చూసిన వాళ్లందరూ ఏముంది ఇందులో అన్నట్లే మాట్లాడారు. మన వాళ్ల కామెంట్లు చూసి తమిళ జనాలు ఆగ్రహించి సోషల్ మీడియాలో గొడవకు దిగారు కూడా. పీఎస్-1 చూసిన తెలుగు వాళ్లు వాళ్లు ఈ కథ ముగింపు విషయంలోనూ ఏమంత ఆసక్తిగా లేని నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నామమాత్రంగానే విడుదలయ్యేలా ఉంది.