వాడి పళ్లు రాలగొడతానని సింగర్ సునీత వార్నింగ్

తన పనేమిటో తాను చూసుకోవటం.. తన గురించి అవాకులు చవాకులు పేలే వారి విషయంలో ఆవేదన వ్యక్తం చేయటమే తప్పించి.. ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేయటం.. బ్యాలెన్స్ మిస్ కావటం అన్నది సింగర్ సునీతలో కనిపించదు.

అలాంటి ఆమె.. తాజాగా మాత్రం తన తీరుకు భిన్నంగా వ్యవహరించారు. తన పేరు వాడుకొని అమాయకుల్ని మోసం చేస్తున్నాడంటూ ఒక వ్యక్తిపై ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేశారు.

తాజాగా ఫేస్ బుక్ లైవ్ లో ఆమె మాట్లాడుతూ.. సింగర్ గా చైతన్య అనే వ్యక్తి చాలామందిని చీట్ చేసినట్లుగా చెప్పారు. అభిమానులు ఎవరూ అతడి వలలో పడొద్దని సునీత కోరారు. అనంతపురానికి చెందిన చైతన్య ఎవరో తనకు తెలీదన్న ఆమె.. తాను ఇంతవరకు అతడ్ని చూడలేదన్నారు.

సెలబ్రిటీల పేర్లు వాడుకొని లాభం పొందేందుకు కుట్రలు చేసే వారు చాలామంది ఉంటారన్నారు. వీరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చీటర్ చైతన్య తన కంటికి కనిపిస్తే మాత్రం వాడి పళ్లు రాలగొడతానని పేర్కొన్నారు.

తన పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న అతడ్ని వదిలిపెట్టనని సునీత వెల్లడించారు. తాను ఈ విషయం మీద పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఇతని వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.