దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర దర్శకుడు దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ ఎప్పుడో దీని గురించి మాట్లాడారు. తామే దేవిని హీరోను చేస్తామన్నారు. కానీ ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చలేదు.

ఇక దేవి ఎప్పటికీ నటనలోకి రాడేమో అనుకుంటుంటే.. కొన్ని నెలల కిందట ‘యల్లమ్మ’ చిత్రంలో లీడ్ రోల్ చేయడానికి ఒప్పుకుని అందరికీ షాకిచ్చాడు. ఇది ముందు నానితో చేయాలనుకున్న సినిమా. తర్వాత నితిన్‌తో అనుకున్నారు. చివరికి దేవి ఆ స్థానంలోకి వచ్చాడు. ఇన్నేళ్ల తర్వాత, ఈ సినిమాతోనే హీరో కావడానికి కారణమేంటో దేవి ఒక మీడియా సంస్థకు వెల్లడించాడు.

కథాసుధ పురస్కారాల్లో భాగంగా పీబీ శ్రీనివాస్ అవార్డును అందుకున్న సందర్భంగా ‘యల్లమ్మ’లో తాను భాగం కావడం గురించి దేవి మాట్లాడాడు. దర్శకుడు వేణు కథ చెప్పడం మొదలుపెట్టిన ఐదు నిమిషాలకే తానీ చిత్రాన్ని ఒప్పుకున్నట్లు దేవి వెల్లడించాడు.

‘‘ఇంకొక రకమైన మ్యూజిక్ చేయాలన్న కోరికతోనే చేస్తున్న సినిమా ఇది. అదే సమయంలో చాలామంది చాలా సబ్జెక్ట్స్ చెప్పి నటించమని నన్ను అడిగారు. కానీ నేను ఎగ్జైట్ అవ్వకుండా ఏదీ చేయడానికి మనసు రాదు. సరే చూద్దాం చూద్దాం అనుకుంటూ తోసుకుంటూ వచ్చేశాను. ఐతే సడెన్‌గా ‘యల్లమ్మ’ కథ చెప్పగానే వెంటనే బాగా కనెక్ట్ అయిపోయాను.

కథ చెప్పడం మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లోనే మనం ఇది చేయల్సిందే అనే ఫీలింగ్ వచ్చింది. వేణు అంత అద్భుతంగా ఈ కథ చెప్పాడు. ఈ సినిమాకు నన్ను తీసుకున్నందుకు మా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణులకు పెద్ద థ్యాంక్స్. నేను సంగీత దర్శకుడిగా పరిచయం అయిన సినిమా ‘దేవి’. అది అమ్మోరు సినిమా. మళ్లీ ఇన్ని సినిమాలకు నేను మ్యూజిక్ చేశాక నన్ను నటుడిగా పరిచయం చేస్తున్న సినిమా ‘యల్లమ్మ’ కూడా అమ్మోరు సినిమా.

అంతేకాక సంగీత దర్శకుడిగా నా 50వ సినిమా ‘ఢమరుకం’ శివుడి మీద తీసింది. ఇలా కుదరడమే పెద్ద అదృష్టం అనుకుంటా. ‘యల్లమ్మ’ గ్లింప్స్ చూస్తే.. గజ్జలు కట్టుకుని, ఒక డప్పు సౌండుతో ఉంటుంది. సంగీతానికి బాగా స్కోప్ ఉన్న చిత్రమిది. కథ కూడా అద్భుతంగా ఉంటుంది. నటుడిగా ఇలాంటి ఒక పెద్ద అడుగు వేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యల్లమ్మ ఆశీర్వాదంతో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని దేవి తెలిపాడు.