ముందు శిష్యుడు.. తర్వాత గురువు


ఈ రోజు ఉదయం నుంచి ఇండియాలో ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం గురించే చర్చ. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట ఈ ఏడాదికి పురస్కారం అందుకుంది. మన తెలుగువాళ్లయిన సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ అకాడమీ వేదిక మీద పురస్కారాలు అందుకోవడం పట్ల తెలుగువాళ్లు పులకించిపోతున్నారు. భారతీయులందరూ కూడా ఈ అవార్డు విషయంలో గర్వపడుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల సంగీత ప్రయాణంలో కీరవాణి అందించిన అద్భుతమైన పాటలు.. అందుకున్న విజయాలు.. చేసిన ప్రయోగాలకు ఇది అసలైన గుర్తింపు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. నిజానికి కీరవాణి ఇంతకంటే గొప్ప పాటలు ఎన్నో స్వరపరిచారు.

తెలుగు సినిమా సంగీతంలో అద్భుతాలను ఆవిష్కరించారు. కానీ ఇప్పుడు ఆస్కార్ లాంటి వేదిక మీద ఆయన గౌరవం అందుకుని ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల నుంచి ప్రశంసలు అందుకుంటుండటం ఆయన అభిమానులకు మహదానందాన్ని కలిగిస్తోంది. ఐతే విశేషం ఏంటంటే.. కీరవాణి కంటే ముందు ఆయన శిష్యుడు ఆస్కార్ అందుకున్నాడు. ఆ శిష్యుడు ఎవరో కాదు.. ఏఆర్ రెహమాన్. 2008లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గాను బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (జైహో) విభాగాల్లో రెండు ఆస్కార్ పురస్కారాలను రెహమాన్ సొంతం చేసుకున్నాడు.

కాకపోతే ఆ అవార్డులు అందుకున్న రెహమాన్ మనవాడే కానీ.. ఆ సినిమా మాత్రం మనది కాదు. కథ అంతా కూడా ఇండియాలోనే నడిచినప్పటికీ.. దాన్ని ప్రొడ్యూస్ చేసింది, డైరెక్ట్ చేసింది బ్రిటన్ వాళ్లు. అందుకే ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాను మనదిగా చెప్పుకోలేం. కానీ ఇప్పుడు ఇండియన్స్.. ముఖ్యంగా తెలుగు వాళ్లు ఇది మా సినిమా, మా పాట అని గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని ‘నాటు నాటు’ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో తన దగ్గర కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేసి ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారిన రెహమాన్ ముందుగా సంగీత విభాగంలో ఇండియాకు ఆస్కార్ అందిస్తే.. ఇప్పుడు మన సినిమాలో మన పాటతో రెహమాన్ గురువు ఆస్కార్ అందుకుని అందరినీ సంతోషంలో ముంచెత్తాడు.