దానయ్య గారు ఎందుకు వెళ్లలేదో

ఇప్పుడు ,ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో ఆర్ఆర్ఆర్ గురించి చర్చ జరుగుతోంది. రేపటి నామినేషన్లలో ఉన్న నాటు నాటుకి ఆస్కార్ వస్తుందా రాదానే దాని మీద ఏకంగా బెట్టింగులు కూడా మొదలయ్యాయట. మాములుగా ఎలక్షన్లు క్రికెట్ మ్యాచుల సందర్భంగా చూసే ఇలాంటి ట్రెండ్ ని మొదటిసారి ఒక తెలుగు సినిమా మీద చూస్తున్నాం. అంతా బాగానే ఉంది కానీ ట్రిపులార్ కి పునాది వేసి బిల్డింగ్ కట్టడానికి డబ్బులు మంచినీళ్లలా ఖర్చు పెట్టిన నిర్మాత డివివి దానయ్య మాత్రం ఎక్కడా కనిపించకపోవడం విచిత్రం. తుది ఘట్టానికి అయినా రావాల్సింది.

నెటిజెన్లకు ఈ ప్రశ్న వేధిస్తోంది. పోనీ అయన అందుబాటులో లేరా అంటే అదేం కాదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఓజి ఓపెనింగ్ అట్టహాసంగా నిర్వహించారుగా. వచ్చిన అతిథులను దగ్గరుండి మరీ రిసీవ్ చేసుకున్నారు. సో హైదరాబాద్ దాటి ఎక్కడికి వెళ్లలేదనే క్లారిటీ ఉంది. అలాంటపుడు యుఎస్ వెళ్లడం ఆయనకేం పెద్ద విషయం కాదు. మనం అనకాపల్లి వెళ్లినంత ఈజీగా అమెరికా ఫ్లైట్ ఎక్కేయొచ్చు. మాములుగా మొహమాటం ఎక్కువగా ఉండే సిగ్గరి దానయ్య. ఆర్ఆర్ఆర్ ఈవెంట్లలోనూ ఎంత బలవంతపెట్టినా పొడిపొడిగా మాట్లాడారు.

ఇదే కారణంతో ఆర్ఆర్ఆర్ సంబరానికి దూరంగా ఉన్నారా లేక ఆస్కార్ ప్రహసనానికి సంబందించిన ఖర్చు మొత్తం రాజమౌళి బృందానిదే కాబట్టి తనకెందుకని సైలెంట్ అయ్యారో మొత్తానికి ఇదేదో సస్పెన్స్ ట్విస్టులా ఉంది. సరే ఇదంతా పక్కనపెడితే తాను వందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమా ఇవాళ వరల్డ్ వైడ్ ఇంత పెద్ద చర్చకు దారి తీసినప్పుడు ఊరికే టీమ్ తో పాటు వెళ్లి ఆ జ్ఞాపకాల్లో భాగమైతే బాగుండేది. బిడ్డ ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా ఆ ఘనతలో కొంతైనా తల్లితండ్రులకు చెందుతుంది కదా. దానయ్య ఇలా అలోచించి ఉంటే బాగుండేదేమో.