ఘన వారసత్వం.. ఈ కష్టాలేమిటో

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల్లో దగ్గుబాటి వారిది ఒకటి. రామానాయుడి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ సురేష్ బాబు అగ్ర నిర్మాతగా ఎదిగితే.. వెంకటేష్ పెద్ద హీరోల్లో ఒకడయ్యాడు. వీరి తర్వాతి తరంలో రానా దగ్గుబాటి నటుడిగా మంచి పేరు సంపాదించాడు. ఈ కోవలోనే రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి కూడా హీరో కావాలనుకున్నాడు. కాకపోతే అతను తెరంగేట్రం చేయడానికి ముందే నెగెటివ్ న్యూస్‌లతో పేరు చెడగొట్టుకున్నాడు. దీని వల్ల అతడి తెరంగేట్రం కూడా కొంచెం ఆలస్యం అయింది.

ఐతే అన్ని అడ్డంకులనూ దాటి అభిరామ్ అరంగేట్ర సినిమాను పట్టాలెక్కించారు. పూర్తి చేశారు కూడా. కానీ ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ఆ సినిమా ఎంతకీ విడుదలకు నోచుకోవడం లేదు. గత ఏడాది లాస్ట్ క్వార్టర్లో సినిమాను రిలీజ్ చేయడానికి చూశారు. కొన్ని రోజులు ప్రమోషన్లు కూడా చేశారు. కానీ తర్వాత ఏమైందో ఏమో.. సినిమా మరుగున పడిపోియంది.

నెలలు గడుస్తున్నా సినిమా రిలీజ్ ఊసే లేదు. ఐతే ఇప్పుడు మళ్లీ ‘అహింస’ వార్తల్లోకి వచ్చింది. ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు కొత్త పోస్టర్ వదిలారు. వేసవి అంటే మంచి సీజనే కానీ.. ఈ సినిమా ఇప్పటిదాకా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సీనియర్ దర్శకుడు తేజ.. తన కెరీర్ ఆరంభంలో తీసిన నువ్వు నేను, జయం సినిమాలను అనుకరిస్తూ ఈ సినిమా చేసినట్లు కనిపించింది. ప్రోమోలు చూస్తే ఇది ఇప్పటి సినిమాలా కనిపించడం లేదు. ఔట్ డేటెడ్ ఫీల్ వస్తోంది. ప్రోమోల్లో అభిరామ్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ట్రేడ్ వర్గాల్లో కూడా బజ్ క్రియేట్ కాకపోవడం వల్లే సినిమాకు బిజినెస్ జరగలేదు.

ఇక లాభం లేదని సురేష్ బాబు సొంతంగా రిలీజ్ చేయడానికి రెడీ అయినట్లు చెబుతున్నారు. ఈ రోజుల్లో లో బజ్‌తో రిలీజయ్యే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయడం అరుదు. టాక్ తెలిసే లోపల వెళ్లిపోతుంటాయి. రిలీజ్ ముందు హైప్ క్రియేటవడం చాలా అవసరం. మరి రిలీజ్ టైంకి ‘అహింస’ టీం బజ్ క్రియేట్ చేయగలుగుతుందేమో చూడాలి.