దిగ్గజాల వల్ల కానిది వేణు సాధించాడా

దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతతో దర్శకుడిగా మొదటి సినిమా ఓకే చేయించుకోడమంటే మాటలు కాదు. బడ్జెట్ ఎంత తక్కువైనా సబ్జెక్టు విషయంలో రాజీ పడని ఆయన ధోరణి అందరికీ తెలిసిందే. అలాంటిది బలగం లాంటి హెవీ ఎమోషన్స్ ఉన్న కథతో కమెడియన్ వేణు మెప్పించడం అంటే విశేషమే. ప్రస్తుతానికి ఈ సినిమాకు మంచి టాక్ నడుస్తోంది. వసూళ్లు భీభత్సంగా లేవు కానీ మెల్లగా ఊపందుకుంటయనే నమ్మకం టీమ్ మొత్తంలో కనిపిస్తోంది. సరే ఫైనల్ స్టేటస్ తేల్చడానికి ఇంకొంచెం టైం పడుతుంది కానీ మొత్తానికి వేణు సక్సెస్ అయిన మాట వాస్తవం.

హాస్య నటులు డైరెక్టర్లుగా మారిన వైనం టాలీవుడ్ లో చాలా తక్కువ. అందులోనూ విజయం సాధించిన వాళ్ళు పెద్దగా లేరు. ఉదాహరణకు ఏవిఎస్ ని తీసుకుంటే సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బడా బ్యానర్ లో రామానాయుడు గారు సూపర్ హీరోస్(1997) రూపంలో అవకాశం ఇచ్చారు. కానీ అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది తర్వాత మంచి ఫామ్ లో కుర్ర హీరోతో అంకుల్(2000) అని తీస్తే అదీ తేడా కొట్టింది. దెబ్బకు సైలెంట్ అయ్యారు. ఎంఎస్ నారాయణ కొడుకుని హీరోగా సెటిల్ చేయొచ్చనే ఉద్దేశంతో కొడుకు(2004)నే టైటిల్ గా పెట్టి సీరియస్ డ్రామా తీశారు రెండో రోజే బాక్సులు వెనక్కు వచ్చాయి.

తర్వాత భజంత్రీలు(2007) అని మరో ప్రయత్నం చేశారు కానీ రివర్స్ అయ్యింది. ఈ రెండు సినిమాల వల్ల చాలా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అంతకు ముందే ధర్మవరపు సుబ్రహ్మణ్యం రెండు తోకల పిట్ట(1997) పేరుతో సీనియర్ నరేష్ తో ఓ చిత్రం డైరెక్ట్ చేశారు. అది ఎవరికీ గుర్తు లేకుండా పోయింది. రచయితగా నటుడిగా మంచి అనుభవమున్న కృష్ణ భగవాన్ ఏకంగా సిమ్రాన్ ని తీసుకొచ్చి జాన్ అప్పారావు 40 ప్లస్ (2008) అనే ప్రయోగం చేశారు. మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. కానీ వేణుకి వీళ్లకు ఎదురైన అనుభవం కలగలేదు. బలగంని అందరూ యునానిమస్ గా మెచ్చుకున్నారు. కమర్షియల్ గా లాభాలొస్తే చాలు.