‘వీరసింహారెడ్డి’లో తప్పులు ఒప్పులు

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఘనవిజయం సాధించిన సినిమా ‘వీరసింహారెడ్డి’. సినిమాకు యావరేజ్ టాకే వచ్చినా.. ‘వీరసింహారెడ్డి’ నుంచి గట్టి పోటీ ఎదురైనా ఈ సినిమా ఉన్నంతలో మెరుగైన వసూళ్లే సాధించి సూపర్ హిట్ రేంజికి వెళ్లింది.

తెలుగులో వచ్చే పేరున్న సినిమాలను విశ్లేషిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పే లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ.. ‘వీరసింహారెడ్డి’ మీద కూడా తన అనాలసిస్‌ను ‘పరుచూరి పలుకులు’లో అందించారు. ఈ సినిమాలో చోటు చేసుకున్న తప్పిదాలు.. అలాగే తనను బాగా ఆకట్టుకున్న విషయాల గురించి ఆయన మాట్లాడారు.

‘వీరసింహారెడ్డి’లో ఫస్టాఫ్ చాలా బాగుందని.. కానీ సెకండాఫ్ అనుకున్నంతగా లేదని పరుచూరి అభిప్రాయపడ్డారు. పెద్ద బాలయ్య పాత్రను ఇంటర్వెల్ కంటే ముందే చంపేయాల్సింది కాదని ఆయనన్నారు. ఇలా ప్రధాన పాత్రను మధ్యలోనే చంపేస్తే ప్రేక్షకుల్లో నిరాశ వస్తుందని పరుచూరి అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కొనఊపిరితో ఉన్న తండ్రిని చిన్న బాలయ్య సీమకు తీసుకువచ్చి.. అక్కడ ఆయన ఫ్లాష్ బ్యాక్ వినడం మొదలుపెట్టి.. తన కథ కొడుక్కి తెలిశాక ఆ పాత్ర చనిపోయి ఉంటే బాగుండేదని.. అంతే కాక చిన్న బాలయ్య తనే రంగంలోకి దిగి తన అత్తకు అసలు విషయం తెలిసేలా చేసి ఉంటే మెరుగ్గా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌కు చాలా సమయం కేటాయించారని.. అనవసరమైన నిడివి పెట్టుకోకూడదని ఆయన అన్నారు.

నవీన్ చంద్రను చంపింది విలనే అనే విషయం తనకు ముందే అర్థం అయిపోయిందని.. ఒకవేళ అతను నిజంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించి ఉంటే సినిమా ఆడేది కాదని పరుచూరి చెప్పారు. సినిమాలో అనేక లోపాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం రూ.134 కోట్లు వసూలు చేసిందంటే అందుకు ఏకైక కారణం బాలయ్యేనని.. ఈ సినిమాలో ఆయన్ని చూస్తుంటే బోయపాటి సినిమాలు చూస్తున్నట్లే అనిపించిందని.. సింహా, లెజెండ్ సినిమాల్లో బాడీ లాంగ్వేజ్‌నే ఇందులో రిపీట్ చేసినట్లు అనిపించిందని.. బాలయ్య ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పవర్ ఫుల్ డైలాగులు ఇందులో పడ్డాయని పరుచూరి అభిప్రాయపడ్డారు.