ఆస్కార్ వేదిక మీద నాటు నాటు లైవ్

చూస్తుంటే కల సాకారమయ్యే రోజు అతి దగ్గరలోనే ఉందనిపిస్తోంది. ఇంకో పది రోజుల్లో జరగబోతున్న ఆస్కార్ సంరంభం కోసం ఈసారి దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి అఫీషియల్ గా నామినేషన్ గెలుచుకున్న నాటు నాటుకి అవార్డు ఖాయమనే అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయని ఇటీవలి పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. తాజాగా ఈ పాటను స్టేజి మీద లైవ్ లో పాడి వినిపించేందుకు రమ్మని గాయకులు రాహుల్ సిప్లిగుంజ్, కాలభైరవలకు అకాడమీ నుంచి అధికారికంగా ఆహ్వానం అందింది. ఆ మేరకు సంస్థే ట్వీట్ చేసింది.

ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం యుఎస్ లో రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, కార్తికేయ తదితరులతో ఈ ఇద్దరూ సింగర్స్ జాయినవుతారు. ఈ 6వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణం కాబోతున్నాడు. తారకరత్నపెద్ద కర్మ పూర్తవ్వడంతో పాటు ఇతరత్రా పనులన్నీ అయిపోవడంతో ఆస్కార్ టీమ్ తో చేతులు కలపనున్నాడు. గతం వారం రోజులుగా చరణ్ సోషల్ మీడియాలో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ నానా యాగీ చేసి వ్యవహారాన్ని దూరం తీసుకెళ్లారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్వయంగా క్లారిటీ ఇచ్చేదాకా వెళ్లిందంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

మాములుగా లైవ్ గా పాడాలని పిలిచారంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటేనే చేస్తారు. మరోవైపు తారక్ చరణ్ ఇద్దరూ దానికి తగ్గట్టు అక్కడే డాన్స్ చేస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అవార్డు వస్తే చేస్తామని సంకేతాలు గతంలో ఇచ్చారు కానీ పన్నెండో తేదీ వస్తే కానీ ఈ చిక్కుముడి వీడదు. గతంలో ఏ భారతీయ సినిమాకు దక్కనంత ప్రతిష్టను గౌరవాన్ని సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్ ఎల్లుండి నుంచి యుఎస్ లో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇంకో ఇరవై రోజుల్లో మొదటి యానివర్సరీ రాబోతున్న టైంలోనూ హౌస్ ఫుల్స్ నమోదు కావడం గమనార్హం.