ఇటు బ్లాక్‌బ‌స్ట‌ర్లు.. అటు భారీ క‌మిట్మెంట్లు

పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ.. ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన నిర్మాణ సంస్థ‌. ఒక‌ప్పుడు వేరే నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి చిన్న‌, మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ.. పెద్ద‌గా గుర్తింపు లేకుండా సాగిపోయిన ఈ సంస్థ‌.. ఇప్పుడు టాలీవుడ్లో టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల్లో ఒక‌టిగా ఎదుగుతోంది.

గ‌త ఏడాది కార్తికేయ‌-2, ధ‌మాకా లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ పేరు మార్మోగిపోయింది. ఇవి మిడ్ రేంజ్ బ‌డ్జెట్ల‌లోనే తెర‌కెక్కిన‌ప్ప‌టికీ.. భారీ విజ‌యాన్నందుకుని ఆ సంస్థ ప్ర‌తిష్ట‌ను పెంచాయి. ఈ విజ‌యాల‌తో మంచి ఊపులో ఉండ‌గానే.. టాలీవుడ్లో ఇద్ద‌రు టాప్ స్టార్ల‌తో సినిమాలు నిర్మించే అవ‌కాశం పీపుల్స్ మీడియా అధినేత‌లు విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభొట్ట‌ల‌కు ద‌క్కింది.

ఆల్రెడీ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ‌లో ప్ర‌భాస్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతోంది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లైన ఈ సినిమాను ముందు వేరే సంస్థ‌కు అనుకున్నారు. కానీ అది అటు ఇటు తిరిగి పీపుల్స్ మీడియా చేతికి చిక్కింది. ప్ర‌భాస్‌తో సినిమా అంటే పీపుల్స్ మీడియా పెద్ద రేంజికి వెళ్లిపోయిన‌ట్లే. కాక‌పోతే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా గురించి మీడియాలో, సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేయ‌డానికి వీల్లేక‌పోయింది. తాజాగా పీపుల్స్ మీడియా బేన‌ర్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా కూడా మొద‌ల‌వ‌డం విశేషం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేంజి గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. వినోదియ సిత్తంకు రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ మేన‌ల్లుడు సాయిధ‌రమ్ తేజ్ కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భాస్ సినిమాకు ఉన్న ఇబ్బందే ఈ చిత్రానికి కూడా త‌ప్ప‌లేదు. రీమేక్ అయిన ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్యాన్స్ వ్య‌తిరేకిస్తుండ‌డం వ‌ల్ల లోప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సి వ‌స్తోంది. ఏదైతేనేం వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో ఊపుమీదున్న పీపుల్స్ మీడియా సంస్థ‌కు ఇద్ద‌రు టాప్ స్టార్ల‌తో సినిమాలు చేసే అవ‌కాశం ద‌క్కింది. ఇవి అంచ‌నాల‌ను అందుకుంటే ఈ సంస్థ వేరే లెవెల్‌కు వెళ్లిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.