అభిమానులూ…ఇంతకన్నా లాగకండి

ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ జాతి నిండు గౌరవాన్ని అని ఊరికే అనలేదు. ఇది ప్రతి భారతీయుడికి బంగారు మాట. ఏ రంగంలో విజయం సాధించినా దాన్ని నలుదిశలా వ్యాపింపజేసి ఇది మా సత్తా అని చాటేలా అందరూ నడుం బిగించాలి. ఇంకో పన్నెండు రోజుల్లో ఆస్కార్ సంబరం జరగబోతోంది.

నాటు నాటు పాట విజేతగా నిలుస్తుందా లేదా అనేది తర్వాత విషయం. అక్కడిదాకా వెళ్లడమే గొప్ప ఘనత. బాలీవుడ్ దిగ్గజాలకు కలలో సాధ్యం కానివాటిని రాజమౌళి అంతర్జాతీయ వేదికల మీద చేసి చూపించారు. విదేశీయులతో చప్పట్లు కొట్టించుకున్నారు

ఇదంతా నాణేనికి ఒకవైపైతే రెండోవైపు అభిమానుల సోషల్ మీడియా గొడవలు మరీ కింది స్థాయికి వెళ్లిపోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లలో ఎవరు గొప్పనే దాని మీద పరస్పరం ట్వీట్లు డిబేట్లు చేసుకుంటూ ట్రోలింగ్ కి పాల్పడుతూ వ్యవహారాన్ని చాలా దూరం తీసుకెళ్తున్నారు.

ఆఖరికి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ త్వరలో తారక్ కు అవార్డు ఇస్తామని అధికారికంగా చెప్పేదాకా ఇద్దరి ఫ్యాన్స్ ఈ ఇష్యూ ని లాక్కెళ్లారు. నిజానికి తారకరత్న మరణంతో పాటు ముందే ప్లాన్ చేసుకున్న కొరటాల శివ సినిమా ఓపెనింగ్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ మొన్న ఈవెంట్ లో లేడనే సంగతి అందరికీ తెలిసిందే

కానీ దాన్ని తేలికగా మర్చిపోయి పదే పదే ఒకరినే ఎలివేట్ చేసే ప్రయత్నం చేయడం ఎంతమాత్రం సబబు కాదనేది నెటిజెన్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అక్కడేమో జపాన్ లో వంద రోజులు దాటినా ఆర్ఆర్ఆర్ హౌస్ ఫుల్స్ తో ఆడుతున్నందుకు గర్వపడాలో లేక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదాని ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ కి పాల్పడుతూ కామెంట్లు చేస్తున్న అపరిపక్వ అభిమానుల ఉత్సాహానికి బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇకనైనా ఒకరికొకరు మద్దతు ఇచ్చి తారక్ చరణ్ ల మధ్య స్నేహంలాగే పరస్పరం సపోర్ట్ చేసుకుంటే హీరోలే కాదు ఫ్యాన్స్ కూడా గొప్పని ఫారిన్ మీడియా కూడా ఒప్పుకుంటుంది.