లైంగిక వేధింపులపై ఓపెన్ అయిన సీనియర్ నటి

తెలుగులో పెద్ద కథానాయికగా ఎదిగిన తెలుగు కథానాయికల్లో ఆమని ఒకరు. మిగతా హీరోయిన్లలా గ్లామర్ ముద్ర వేయించుకోకున్నా.. కెరీర్ ఆసాంతం ఎక్కువగా సంప్రదాయబద్ధమైన పాత్రలే చేసినా.. వాటితోనే మంచి గుర్తింపు సంపాదించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందామె. కథానాయికగా ఆమె తొలి చిత్రం ‘జంబలకిడిపంబ’ సూపర్ హిట్ కాగా.. ఆ తర్వాత శుభలగ్నం, మావిచిగురు సహా చాలా హిట్ సినిమాల్లో ఆమె నటించింది.

కథానాయికగా కెరీర్ ముగిశాక సినిమాలు పక్కన పెట్టేసి కుటుంబ జీవితానికి పరిమితం అయిన ఆమె.. కొన్నేళ్లుగా క్యారెక్టర్ రోల్స్‌లో ఆకట్టుకుంటోంది. ఈ మధ్య ఎక్కువగా అమ్మ పాత్రలు చేస్తోంది. తాజాగా ఆమె తన కెరీర్ ఆరంభంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయింది. ఒక డిస్ట్రిబ్యూటర్ కూతురినైన తనకు కూడా ఈ తరహా ఇబ్బందులు తప్పలేదని ఆమె వెల్లడించింది.

‘‘మా నాన్న డిస్ట్రిబ్యూటర్. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని ఉండేది. నేను తెరంగేట్రం చేస్తానంటే ముందు నాన్న ఒప్పుకోలేదు. తర్వాత నా ఇష్టం చూసి సరే అన్నారు. ముందు తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టాను. అవకాశాల కోసం రెండేళ్లు కష్టపడ్డాను. ఛాన్స్ ఇస్తామంటూనే తమకు నచ్చినట్లు ఉండాలని పరోక్షంగా చెప్పేవాళ్లు.

ఒంటరిగా వచ్చి కలవమని చెప్పేవాళ్లు. మా అమ్మ అండతో వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించా. కొంత కాలానికి వాళ్ల మాటల్లోని అర్థాలు తెలిశాయి. అప్పుడు చాలా బాధ పడ్డా. నాన్న చెప్పినా వినకుండా తప్పుడు మార్గంలోకి వచ్చేశానా అనిపించింది. కానీ కొన్ని రోజులకే తెలుగులో ‘జంబలకిడి పంబ’ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

నా కెరీర్ ఊపందుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగాను. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది’’ అని ఆమని వెల్లడించింది. తన కెరీర్లో చిరంజీవి పక్కన కథానాయికగా చేయకపోవడమే లోటని, ‘రిక్షావోడు’లో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్సయిందని ఆమె తెలిపింది.