ప్ర‌భాస్ ఫ్యాన్స్ త‌ట్టుకోగ‌ల‌రా?


2013లో మిర్చి సినిమా రిలీజ‌య్యాక దాదాపు ప‌దేళ్ల వ్య‌వ‌ధిలో ప్ర‌భాస్ నుంచి రిలీజైన‌వి మూడు సినిమాలు మాత్ర‌మే. బాహుబ‌లి రెండు భాగాల‌ను క‌లిపి రెండు సినిమాలు అనుకున్నా.. అత‌ను చేసింది నాలుగు చిత్రాలే. బాహుబ‌లి లాంటి సినిమా కోసం ఎన్నేళ్లు ఎదురు చూసినా ఓకే కానీ.. సాహో, రాధేశ్యామ్ లాంటి డిజాస్ట‌ర్ల కోసం ఏళ్ల‌కు ఏళ్లు ఎదురు చూసి చివ‌రికి నిరాశ చెందారు ఫ్యాన్స్.

ఐతే ప్ర‌భాస్ ఈ రెండు చిత్రాల త‌ర్వాత స్పీడు పెంచాడు. చ‌క‌చ‌కా సినిమాలు కానిచ్చేస్తున్నాడు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి రిలీజ్ డేట్లు కూడా ఖ‌రారు చేసుకుంటున్నాయి. ప్ర‌స్తుతం అనౌన్స్ చేసిన ప్ర‌కారం అయితే కేవ‌లం ఏడు నెల‌ల వ్య‌వ‌ధిలో మూడు భారీ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు ప్ర‌భాస్. ఇన్నాళ్లూ అనావృష్టిలా సాగిన వ్య‌వ‌హారం ఇప్పుడు అతివృష్టి అయ్యేలా ఉంది.

సంక్రాంతికి రావాల్సిన ప్ర‌భాస్ కొత్త సినిమా ఆదిపురుష్ జూన్ 16కు వాయిదా ప‌డ్డ సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతానికి చిత్ర బృందం ఆ తేదీకే క‌ట్టుబ‌డి ఉంది. ఇక స‌లార్ మూవీని ఈ ఏడాది సెప్టెంబ‌రు 28కి షెడ్యూల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప్రాజెక్ట్ కే 2024 జ‌న‌వ‌రి 12కు షెడ్యూల్ అయింది. అంటే ఏడు నెల‌ల వ్య‌వ‌ధిలో ప్ర‌భాస్ సినిమాలు మూడు రిలీజ్ కాబోతున్నాయ‌న్న‌మాట‌.

ప్ర‌భాస్ లాంటి సూప‌ర్ స్టార్ నుంచి ఇంత త‌క్కువ గ్యాప్‌లో మూడు సినిమాలు రావ‌డం, అవి మూడూ భారీ చిత్రాలే కావ‌డం అసాధార‌ణ విష‌యం. అనుకున్న ప్ర‌కారం ఈ మూడు చిత్రాలూ ఆయా తేదీల్లో వ‌స్తే ప్ర‌భాస్ అభిమానులు అంత ఆనందాన్ని త‌ట్టుకోగ‌ల‌రా అన్న‌ది డౌట్. ప్ర‌భాస్ సినిమాల కోసం ఏళ్ల‌కు ఏళ్లు ఎదురు చూడ‌డ‌మే అల‌వాటైన వారికి ఇది అప‌రిమిత ఆనందాన్ని ఇచ్చే విష‌య‌మే. మ‌రి నిజంగా ప్ర‌భాస్ మాట నిల‌బెట్టుకుని ఏడు నెల‌ల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తాడేమో చూడాలి.