అల్లు వారికి అగ్నిపరీక్ష


అల్లు అరవింద్ తరం నిర్మాతల్లో చాలామంది తెర మరుగైపోయారు. నిర్మాణ సంస్థల్ని మూసేశారు. సురేష్ బాబు అంతటి వాడు కూడా సినిమాల ప్రొడక్షన్ బాగా తగ్గించేశాడు. అశ్వినీదత్ మధ్యలో కొన్నేళ్లు ప్రొడక్షన్ ఆపేసి.. మళ్లీ కూతుళ్లు, అల్లుడి పుణ్యమా అని తిరిగి ఊపందుకున్నాడు. వీరిని మినహాయిస్తే అప్పటితరం నిర్మాతలెవరూ అడ్రస్ లేరు. కానీ అరవింద్ మాత్రం ఇప్పుడు కూడా ట్రెండీగా సినిమాలు తీస్తూ, మంచి సక్సెస్ రేటుతో సాగిపోతున్నారు.

కథల ఎంపికలో.. సినిమాల ఫలితాలను అంచనా వేయడంలో దిట్టగా అల్లు అరవింద్‌కు పేరుంది. ఆయనకు బన్నీ వాసు లాంటి యంగ్ మైండ్ తోడవడంతో గీతా ఆర్ట్స్ ఈ రోజుల్లోనూ ట్రెండీగా సినిమాలు తీయగలుగుతోంది. విజయాలు సాధిస్తోంది. కానీ ఈ మధ్య అరవింద్-వాసుల జడ్జిమెంట్ కొంచెం దెబ్బ తింటున్నట్లు అనిపిస్తోంది.

చావు కబురు చల్లగా, పక్కా కమర్షియల్ లాంటి సినిమాలు ‘గీతా’ పేరును బాగా దెబ్బ తీశాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఊర్వశివో రాక్షసివో, 18 పేజెస్ ఏదో ఒక మోస్తరుగా ఆడేశాయి కానీ.. ఆ సంస్థ స్థాయికి తగ్గ సినిమాలైతే కావు. ఇలాంటి పరిస్థితుల్లో గీతా నుంచి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రిలీజవుతోంది. శివరాత్రి కానుకగా శనివారం రిలీజ్ కానున్న ఈ చిత్రంలో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరో. అతను మొదట్లో ప్రామిసింగ్‌గా కనిపించినా.. తర్వాత పేలవమైన సినిమాలతో పేరు దెబ్బ తీసుకున్నాడు. అతణ్ని నమ్మి మురళీ కిషోర్ అనే కొత్త దర్శకుడికి అవకాశమిచ్చి అరవింద్, వాసు ‘వినరో భాగ్యము..’ తీశారు. ఈ సినిమాతో గీతా సంస్థ బలంగా బౌన్స్ బ్యాక్ అవుతుందని వారు ఆశిస్తున్నారు.

‘సార్’ సినిమా మేకర్స్ ధీమాగా ముందు రోజే ప్రిమియర్స్ వేసి మంచి ఫలితం అందుకునేసరికి.. తమ సినిమా మీద నమ్మకాన్ని చాటుతూ ‘వినరో భాగ్యము..’కు కూడా ముందు రోజే ప్రిమియర్లు ప్లాన్ చేశారు. మరి నిజంగా సినిమాలో అంత విషయం ఉందా.. అల్లు వారి జడ్జిమెంట్‌ను నిలబెట్టేలా ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటుందా అన్నది ఈ రోజు అర్ధరాత్రికి తేలిపోతుంది.