జక్కన్నతో చేయడానికి ముందు జక్కన్నే టార్గెట్


టాలీవుడ్లో స్టార్ హీరోలను మించిన ఇమేజ్ రాజమౌళిది. ఇప్పుడు టాలీవుడ్లోనే కాక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రాజమౌళి రికార్డులంటూ ప్రత్యేకమైన కేటగిరీ ఏర్పాటైంది. దాని గురించి స్టార్ హీరోలు కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. రాజమౌళి సినిమాల కలెక్షన్లను అందుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. ‘బాహుబలి’ సినిమా వరకు ‘నాన్ బాహుబలి’ అనే రికార్డులుండేవి కానీ.. జక్కన్న తర్వాతి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ‘నాన్-ఎస్ఎస్ఆర్’ అనే కొత్త కేటగిరీ వచ్చింది. ఇప్పుడు ఇదే లక్ష్యంగా స్టార్ హీరోలు అడుగులు వేస్తున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న కొత్త సినిమాకు కూడా ఇదే లక్ష్యం అంటున్నాడు దాని నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాగవంశీ.

“త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో మహేష్ గారు చేస్తున్న సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గదు. ఈ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నామంటే.. విడుదలైన ప్రతి చోటా ఇది సూపర్ హిట్ అవుతుంది. రాజమౌళి గారి సినిమాల నంబర్లకు దగ్గరగా వెళ్తుంది. మేం ‘అల వైకుంఠపురములో’ సినిమా టైంలోనూ రాజమౌళి గారి సినిమాల నంబర్లకు దగ్గరగా వెళ్లాం. మహేష్-త్రివిక్రమ్ సినిమా కూడా మా అంచనాలను అందుకుంటుందని ఆశిస్తున్నాం” అని నాగవంశీ తెలిపాడు.

మహేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అతడు’ టాలీవుడ్ ఆల్ టైం గ్రేట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రెండో చిత్రం ‘ఖలేజా’ ఫ్లాప్ అయినా.. ఇప్పటికీ టీవీల్లో, యూట్యూబ్‌లో ప్రేక్షకులను అలరిస్తోంది. వీళ్లిద్దరూ సుదీర్ఘ విరామం తర్వాత కలిసి సినిమా చేస్తుండడంతో దానిపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజమౌళి సినిమా చేయడానికి ముందే మహేష్ సినిమా ఆయన చిత్రాల నంబర్ల దగ్గరగా వెళ్లే.. ఇక జక్కన్నతోనే జట్టు కడితే దానికి ఆకాశమే హద్దు అన్నమాట.