వామ్మో.. ఆ దర్శకుడికి ఇన్ని కమిట్మెంట్లా?

పరశురామ్ పెట్ల.. ఏడాది ముందు వరకు అతడి నుంచి వచ్చిన సినిమాలన్నీ చిన్న, మిడ్ రేంజివే. ‘గీత గోవిందం’ సైతం మొదలైనపుడు పెద్ద రేంజేమీ కాదు. ఆ సినిమాకు అన్నీ కలిసొచ్చి ఊహించని స్థాయిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆ తర్వాత అనుకోకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు పరశురామ్. ఐతే వీరి కలయికలో వచ్చిన ‘సర్కారు వారి పాట’ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో కొత్త సినిమా కోసం పరశురామ్ కొంచెం కష్టపడుతున్నట్లే కనిపించింది.

నాగచైతన్యతో చేయాల్సిన సినిమా అటకెక్కి.. బాలయ్య కోసం చేసిన ప్రయత్నం ఫలించక.. చివరికి ‘గీతగోవిందం’ హీరో విజయ్ దేవరకొండతోనే ఇంకో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు పరశురామ్. ఐతే ఈ సినిమాను ‘గీత గోవిందం’ అల్లు అరవింద్‌కు చేయాల్సిన వాడు.. అనూహ్యంగా దిల్ రాజుకు కమిట్మెంట్ ఇవ్వడం మీద తీవ్ర దుమారమే రేగింది.

ఈ సమయంలోనే పరశురామ్ అడ్వాన్సులు తీసుకోవడమో, లేక మాట ఇవ్వడమో చేసిన నిర్మాతల జాబితాలో బయటికి వచ్చింది. ఆ లిస్టు చూసి ఇప్పుడు అందరూ నివ్వెరబోతున్నారు. గీతా ఆర్ట్స్ బేనర్లోనే పరశురామ్ ఇంకో రెండు సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకున్నాడట. అలాగే ఇప్పుడు సినిమా చేయబోతున్న దిల్ రాజుతో ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది. ఇక 14 రీల్స్‌ వాళ్లతో ఒక ఫుల్ లెంగ్త్ సినిమా చేయాల్సి ఉంది. నాగచైతన్యతో అనుకున్న సినిమా కుదర్లేదు. మధ్యలో ‘సర్కారు వారి పాట’లో వారిని భాగస్వామిని చేశాడు కానీ.. అలా కాకుండా ఆ బేనర్లో సోలోగా సినిమా చేయాల్సి ఉందట.

అలాగే సీనియర్ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ దగ్గర పరశురామ్ చాన్నాళ్ల కిందటే అడ్వాన్స్ తీసుకున్నాడట. కానీ ఆ ప్రాజెక్టు సంగతి అతీ గతీ లేదు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్‌లో కూడా ఓ సినిమాకు కమిట్మెంట్ ఉందట. ఇంకా మంచు వారికి కూడా ఎప్పుడో ఒక కమిట్మెంట్ ఇచ్చాడట. అంతే కాక కొత్తగా ప్రొడక్షన్ మొదలుపెట్టాలనుకుంటున్నఐడ్రీమ్ సంస్థ అధినేత వాసుదేవరెడ్డి, అల్లు అర్జున్ స్నేహితుడైన కేదార్‌లకు కూడా పరశురామ్ సినిమాకు హామీ ఇచ్చినట్లు సమాచారం. మరి ఇంతమందికి హామీలను నెరవేర్చాలంటే పరశురామ్‌కు ఎన్నేళ్లు పడుతుందో?