అల్లు మీటింగ్ క్యాన్సిల్ – అసలేం జరుగుతోంది

టాలీవుడ్ లో వాడివేడిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయాన్నే అల్లు అరవింద్ నుంచి మీడియాకు ప్రెస్ మీట్ కు రమ్మని ఆహ్వానం అందింది. ముందు బాలయ్య నర్సుల కామెంట్ వివాదమేమో అనుకున్నారు. తీరా చూస్తే అది కాదు నిన్న దర్శకుడు పరశురామ్ విజయ్ దేవరకొండ కాంబోలో దిల్ రాజు అనౌన్స్ చేసిన ప్రాజెక్టు గురించని మరో లీక్ వచ్చింది. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన అరవింద్ చాలా ఆగ్రహంగా ఉన్నారని ఎన్నో విషయాలపై కుండ బద్దలు కొట్టబోతున్నారని భావించిన జర్నలిస్టులు దానికి సిద్ధమవుతుండగానే మళ్ళీ క్యాన్సిల్ అంటూ సందేశం రావడం మరో షాక్.

ఫైనల్ గా సమావేశం రద్దు చేశామని తేల్చేశారు. అంతా ప్రశాంతంగా ఉన్న టైంలో టీ కప్పులో తుఫాను లాగ ఇప్పుడీ కాంట్రావర్సీ తలెత్తితే దాని వల్ల పరిణామాలు కష్టంగా ఉంటాయని ప్రొడ్యూసర్స్ గిల్డ్ విన్నపం చేయడం వల్లే అరవింద్ వెనక్కు తగ్గారనే మాట వినిపిస్తోంది. గీత గోవిందం కాంబినేషన్ రిపీట్ చేయాలనే ఉద్దేశంతో ఈయన ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ ని పక్కన పెట్టేసి దిల్ రాజుకి కమిట్ కావడం ఇప్పుడీ వివాదానికి దారి తీసిందని వినికిడి. గతంలో పివిపికి వంశీ పైడిపల్లికి ఏదైతే ఇష్యూ వచ్చిందో అచ్చంగా అదే ఇప్పుడూ రిపీట్ అయ్యిందని ఫిలిం నగర్ టాక్.

ఇందులో నిజానిజాలు స్పష్టంగా తెలిసింది అల్లు అరవింద్, దిల్ రాజు,పరశురామ్, విజయ్ దేవరకొండలకే. తమ చేతుల్లో ఉన్న ప్రాజెక్టు తీసుకోవడం ఏమిటనేది గీతా వర్గాల వాదన. అయితే ఇక్కడ స్పష్టత కొరవడుతోంది. ఏది అఫీషియల్ గా బయటికి రావడం లేదు. అంతా లోలోపలే మాట్లాడుకుంటున్నారు. లీక్స్ రూపంలో విషయాలు తెలిసిపోతున్నా తప్పని ఒప్పని ఏదీ చెప్పకుండా మౌనం వహిస్తున్నారు. సాధ్యమైనంత వివాదాలకు దూరంగా ఉంటారని పేరున్న అల్లు అరవింద్ హీరో దర్శకుడి ప్రవర్తన వల్లే సహనం కోల్పోయారనే కామెంట్ కూడా ఉంది. దేన్నీ నిర్ధారించలేం కానీ ఈ స్థాయి ప్రచారానికి ఎవరో ఒకరు అధికారికంగా చెక్ పెట్టడం అవసరం.