భార్యకన్నా ముందు ఫ్యాన్స్ కి చెబుతానన్న తారక్

ఎట్టకేలకు తన కొత్త సినిమా అప్డేట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఓపెనయ్యాడు. అన్నయ్య కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి కొరటాల శివతో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీ గురించి ఫ్యాన్స్ పదే పదే అడగటంతో ఈ ఫిబ్రవరిలోనే పూజ చేసి మార్చి 20 లేదా ఆలోపే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిపోతామని చెప్పి వాళ్ళ చెవుల్లో పాలు పోసినంత పని చేశాడు. మీ ఆరాటాన్ని అర్థం చేసుకోగలనని అలా అని కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్న నిర్మాతల మీద, పని చేసే దర్శకుల మీద ఒత్తిడి పెట్టడం భావ్యం కాదని హితబోధ చేశాడు.

అంతే కాదు ఏదైనా శుభవార్త ఉంటే భార్యకంటే ముందు మీతో పంచుకుంటానని చెప్పి మరో స్వీట్ న్యూస్ చెప్పాడు. దీంతో అక్కడికి విచ్చేసిన తారక్ ఫ్యాన్స్ చప్పట్లతో హోరెత్తించారు. కొంత నలతగా నొప్పి ఉన్నా సరే ఓపిక చేసుకుని మీకోసమే వచ్చానని చెప్పిన జూనియర్ ఈలలు కేకలు వేస్తున్న వాళ్ళను ఉద్దేశించి విన్నపం చేశాడు. అమిగోస్ మీద భారీ అంచనాలు కాదు కానీ బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీగా ఆ స్థాయిలో హైప్ లేదనే కామెంట్స్ కి చెక్ పెడుతూ ఇవాళ నిర్వహించిన ఈవెంట్ ద్వారా మైత్రి మేకర్స్ వేసిన ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయ్యింది.

మొత్తానికి నెలల తరబడి సుమారు ఏడాది తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో ఓ సినిమా ఉంటుందని బయట మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభిమానుల మధ్య రకరకాల చర్చలు జరుగుతున్నాయి.వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న కొరటాల మూవీని ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన ఇంటర్నేషనల్ ఇమేజ్ ని కాపాడుకునేందుకు జూనియర్ ఏ చిన్న రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేడు. అందుకే జాప్యమైనా ఓపిగ్గా భరిస్తున్నాడు