మహేష్ సినిమా ఆడిషన్ నుంచి ఏడుస్తూ..

హైదరాబాద్ అమ్మాయే అయినా బాలీవుడ్లో ఎక్కువగా అవకాశాలు అందుకుని అక్కడే సెటిలైంది సమీరారెడ్డి. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా.. అవన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలే. ఎన్టీఆర్‌తో తొలిసారి ‘నరసింహుడు’ కోసం జత కట్టిన సమీరా.. ఆ తర్వాత అతడితోనే ‘అశోక్’ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవి’ కూడా చేసింది. కానీ ఈ మూడు సినిమాలూ ఫ్లాప్ కావడంతో ఆమెకు తెలుగులో తర్వాత అవకాశాలు రాలేదు. బాలీవుడ్‌కే పరిమితం అయింది.

ఐతే సమీరా నిజానికి ఎన్టీఆర్, చిరుల కంటే ముందు మరో టాప్ స్టార్ మహేష్ బాబుతో జట్టు కట్టాల్సిందట. తన కెరీర్ ఆరంభంలోనే మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చిందని.. కానీ ఆ చిత్రానికి ఆడిషన్ సరిగా చేయకపోవడంతో తనకు ఛాన్స్ మిస్సయిందని తాజాగా వెల్లడించింది సమీరా.

“నా తొలి సినిమా ఆడిషన్ 1998లో జరిగింది. అది కూడా మహేష్ బాబు సినిమా కోసం. ఆ రోజుకు ఎందుకో నాకు చాలా భయమేసింది. ఆ చిత్ర బృందం ఇచ్చిన టాస్క్ చేయలేక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయాను. అప్పటి వరకు నేనొక జాబ్ చేసేదాన్ని. ఆ ఆడిషన్ అనుభవంతో సినిమాల్లో నటించడం నా వల్ల కాదని.. నా జాబ్‌లోనే కొనసాగాలని అనుకున్నా. కానీ తర్వాత కొంత కాలానికి ధైర్యం కూడగట్టుకుని తొలిసారి ఒక ప్రైవేట్ ఆల్బం కోసం కెమెరా ముందుకు వచ్చా. ఆపై నా కెరీర్ మారిపోయింది” అని సమీరా వెల్లడించింది.

1998లో అంటే.. బహుశా అది హీరోగా మహేష్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’ కోసమే అయ్యుండొచ్చు. అలాంటి సూపర్ హిట్ మూవీతో సమీరా కథానాయికగా పరిచయం అయి ఉంటే టాలీవుడ్లో పెద్ద హీరోయిన్లలో ఒకటయ్యేదేమో.