బాక్సాఫీస్‌ పై ‘కంటెంట్’ ఎటాక్

టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఈ వారం ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఈ వీకెండ్లో మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ మూడు చిత్రాలూ వేటికవే ప్రత్యేకమైనవి. ఇందులో ఏదీ మాస్ మసాలా సినిమా లేదు. మూడూ కూడా కథా ప్రాధాన్యం ఉన్నవి, కొంచెం కొత్తదనంతో కూడుకున్నవే కావడం విశేషం.

ముందుగా బరిలోకి నిలుస్తున్న చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఎక్కువ కమెడియన్, సహాయ పాత్రలే చేసిన సుహాస్ ‘కలర్ ఫొటో’ తర్వాత హీరోగా నటించిన చిత్రమిది. తనకు నటుడిగా లైఫ్ ఇచ్చిన ఛాయ్ బిస్కెట్ సంస్థ అధినేతలు అనురాగ్ రెడ్డి-శరత్ చంద్రల నిర్మాణంలో షణ్ముఖ ప్రశాంత్ అనే కొత్త దర్శకుడితో సుహాస్ చేసిన చిత్రమిది.

ఈ సినిమా చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్‌తో రిలీజ్ డే కంటే ఒక రోజు ముందే గురువారం రాత్రి ఈ చిత్రానికి ప్రిమియర్లు వేస్తున్నారు. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని టీం నమ్మకంతో ఉంది. ఇక శుక్రవారం సందీప్ కిషన్ సినిమా ‘మైకేల్’ మంచి అంచనాల మధ్య రిలీజవుతోంది. దీని ట్రైలర్ కూడా వారెవా అనిపించింది. విజయ్ సేతుపతి సహా పేరున్న తారాగణం నటించడం.. ట్రైలర్లో మంచి క్వాలిటీ, కథ పరంగా ఆసక్తి కనిపించడం దీనికి ప్లస్.

సందీప్ కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా అవుతుందన్న అంచనాలు దీనిపై ఉన్నాయి. ఇది కూడా భిన్నమైన సినిమాలాగే కనిపిస్తోంది. ఇక ఈ వారం చివరగా రాబోతున్న సినిమా ‘బుట్టబొమ్మ’.

మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కప్పెలా’కు ఇది రీమేక్. ఇందులో లీడ్ రోల్స్ చేసిన అనైకా, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ పాపులర్ కాకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో టీం ఉంది. కంటెంటే సినిమాను హిట్ చేస్తుందని నమ్ముతోంది. ఈ సినిమా కథాంశం, స్క్రీన్ ప్లే కొంచెం షాకింగ్‌గానే ఉంటాయి. మరి ‘కంటెంట్’ను నమ్ముకుని వస్తున్న ఈ మూడు చిత్రాల్లో బాక్సాఫీస్ దగ్గర ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.