ఐడియా బాగుందయ్యా పద్మభూషణ్

చిన్న సినిమాల కోసం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మహా కష్టం. ముఖ్యంగా టికెట్ రేట్లు మధ్యతరగతికి భారంగా మారిన తరుణంలో టాక్ మరీ ఎక్స్ ట్రాడినరిగా ఉంటే తప్ప కదలడం లేదు. అందులోనూ ఓటిటిలో ఎలాగూ వస్తుందనే భావన అడ్డుగోడగా నిలుస్తోంది. దీనికి చెక్ పెట్టాలంటే ఎవరో ఒకరు నడుం బిగించాలి. మూడున రిలీజ్ కాబోతున్న రైటర్ పద్మభూషణ్ జనాన్ని ఆకట్టుకోవడం కోసం తెలివైన ఎత్తుగడలతో ముందుకు వెళ్తోంది. వారం ముందే పలు నగరాల్లో ప్రీమియర్లు వేయడం ఒక ఎత్తయితే ఇప్పుడు పబ్లిసిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే మరో ప్లాన్ ని సిద్ధం చేసుకున్నారు.

అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి తగ్గింపు వచ్చేలా చేసుకున్నారు. దీని ప్రకారం ఏపీ తెలంగాణ సింగల్ స్క్రీన్లలో కేవలం 110 రూపాయలకే ఈ సినిమా చూడొచ్చన్న మాట. మాములు రోజుల్లో అయితే ఇది ప్రాంతాన్ని బట్టి 112 నుంచి 148 దాకా ఉంది. మల్టీప్లెక్సుల్లో మాత్రం ఏపీకి 177, తెలంగాణ 150 ఫిక్స్ చేశారు. ఇది ప్రభుత్వ జీవో ప్రకారం కనక అంతకు మించి తగ్గించే ఛాన్స్ లేదట. కాస్త పర్సు బరువు ఎక్కువున్నోడు వీటిలో చూస్తాడు. సగటు కామన్ ఆడియెన్ కి హ్యాపీగా సోలో థియేటర్లు మంచి ఛాయస్ అవుతాయి.

సుహాస్ లాంటి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ లేని చిన్న హీరోకి ఇలాంటి మద్దతు అవసరం. సినిమా బాగుందంటే ఆటోమేటిక్ గా పబ్లిక్ వస్తారు కానీ అసలు ఓపెనింగ్స్ తెచ్చుకుని దాని ద్వారా పాజిటివ్ టాక్ రాబట్టుకోవడం చాలా కీలకం. ఇందులో సక్సెస్ అయితే మెల్లగా ఆక్యుపెన్సీలు పెరుగుతాయి. అసలే మైఖేల్ తో గట్టి పోటీ ఉంది. దానికీ భీభత్సమైన హైప్ లేదు కానీ ఉన్నంతలో క్యాస్టింగ్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ యూత్, మాస్ ని ఆకట్టుకుంటున్నాయి. రైటర్ టార్గెట్ చేసింది ఎక్కువ శాతం ఫ్యామిలీస్ ని కాబట్టి తెలివిగా చేసుకోవాలి. కంటెంట్ కనక బాగుంటే ఈ రేట్లతో రైటర్ గెలవొచ్చు.