సమంతా చుట్టూ ఏదో అయోమయం

తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ యశోద టైంలో కనీసం ప్రమోషన్లకు సైతం అందుబాటులో లేకుండా పోయిన సమంత ప్రస్తుతం శాకుంతలం విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఆ మధ్య జరిగిన ట్రైలర్ లాంచ్ తో మళ్ళీ మీడియాతో పాటు అభిమానుల ముందుకు వచ్చిన సామ్ వల్ల నిర్మాణంలో ఉన్న సినిమాలకు సంబంధించి కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నట్టు ఇన్ సైడ్ టాక్. అందులో మొదటిది విజయ్ దేవరకొండ ఖుషీ. ఇంకొంత భాగం షూటింగ్ పూర్తి చేస్తే అయిపోతుందనుకున్న టైంలో సామ్ ఆసుపత్రి పాలయ్యింది. అప్పటి నుంచి నిర్మాణ సంస్థ మైత్రి, దర్శకుడు శివ నిర్వాణ వెయిటింగ్ లో ఉన్నారు.

తీరా చూస్తే తనింకా జాయిన్ కాలేదు. ఇంకో నెల టైం అడిగినట్టు తెలిసింది. విజయ్ ఇది ఫినిష్ చేయడం కోసమే గౌతమ్ తిన్ననూరితో చేయబోయే పోలీస్ యాక్షన్ మూవీ రెగ్యులర్ షెడ్యూల్స్ కి డేట్స్ ఇవ్వలేదు. మరోవైపు సమంతా బాలీవుడ్ వెబ్ సిరీస్ రాజ్ అండ్ డికె రూపొందిస్తున్న సిటాడెల్ చిత్రీకరణ కోసం ముంబైలో ఉన్నట్టు మరో న్యూస్ ఉంది. ఇది కూడా గతంలో ఇచ్చిన కమిట్ మెంటే కానీ ఖచ్చితంగా ఖుషీ తర్వాత ఒప్పుకున్నదే, అలాంటప్పుడు ప్రాధాన్యత ముందు సినిమాకు ఇవ్వాలి కదానే లాజిక్ లో అర్థముంది. అయితే కన్ఫర్మ్ గా ఏదీ చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో సామ్ వస్తే కానీ క్లారిటీ రాదు.

మరోవైపు శాకుంతలం రిలీజ్ కు కేవలం 18 రోజులు మాత్రమే ఉంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ దానికైన బడ్జెట్ కు తగ్గ హైప్ ఇంకా పెరగాల్సి ఉంది. దర్శకుడు గుణశేఖర్ ప్లాన్స్ తో సిద్ధంగా ఉన్నాడు. సమంతా హైదరాబాద్ కు వచ్చిన మరుక్షణం నుంచి పరుగులు పెట్టాలి. ఈ సినిమా వస్తోందని తెలిసినా కూడా ఆల్రెడీ బరిలో ఉన్న ధనుష్ సర్, కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథలు తప్పుకోలేదు. విశ్వక్ సేన్ ధమ్కీ మాత్రమే వాయిదా వేసుకుంది. యశోదకు పోటీ లేదు కాబట్టి సరిపోయింది కానీ శాకుంతలంకి బజ్ తేవాలంటే మాత్రం స్పీడ్ పెంచాల్సిందే.