పేరుకే నిర్మాత.. గౌరవం లేదు

‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందు రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సినిమా విషయంలో టీంలో మిగతా అందరి లాగే నిర్మాతలకు కూడా మంచి పేరే వచ్చింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిల పేర్లు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. ‘ఆర్క మీడియా వర్క్స్’ అనే వాళ్ల బేనర్ పేరు కూడా మార్మోగింది. శోభు అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. రాజమౌళి కూడా ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చారు. తాను ఎక్కడికి వెళ్లినా శోభును వెంటబెట్టుకునే వెళ్లేవాడు. కానీ ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చేసరికి కథ మారిపోయింది.

ఈ సినిమాకు నిర్మాతగా డీవీవీ దానయ్య పేరు ఊరికే పడిందంటే పడింది. ఎన్నో ఏళ్ల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆయన్ని ఈ సినిమాలో భాగస్వామిని చేశారు రాజమౌళి. ఆయనతో పెట్టుబడి పెట్టించి.. అందుకు తగ్గ ప్రతిఫలం ఏదో దక్కేలా చేశారు తప్పితే.. ముందు నుంచి ప్రమోషన్లు సహా ఎక్కడా దానయ్యకు ప్రాధాన్యం దక్కలేదు.

దానయ్య సైతం ఈ విషయంలో పెద్దగా ఫీలైనట్లు లేరు. రాజమౌళి తనకు ఈ సినిమా చేయడమే గొప్ప గౌరవం, ఇదొక అరుదైన అవకాశం అనుకుని ఆయన మిన్నకుండిపోయారు. ఈ సినిమాతో తన బేనర్ బ్రాండ్ వాల్యూ పెంచుకునే ప్రయత్నం కూడా పెద్దగా చేసినట్లు కనిపించలేదు. ఇక సినిమా థియేటర్లలోకి దిగిన కొంత కాలానికే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ దీంతో ఇక తమకేం సంబంధన్నట్లు తయారైంది.

అంతర్జాతీయ స్థాయిలో సినిమా పేరు మార్మోగుతుంటే.. విదేశాల్లో ప్రమోషన్లు హోరెత్తుతుంటే నిర్మాత గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఆయన్ని పట్టించుకునేవాళ్లు లేరు. మొన్న గోల్డెన్ గ్లోబ్, ఇప్పుడు ఆస్కార్ హడావుడి టైంలోనూ అంతే. తాజాగా ‘నాటు నాటు’కు ఆస్కార్ నామినేషన్ దక్కిన నేపథ్యంలో రాజమౌళి ఒక ఎమోషనల్ నోట్ ఒకటి రిలీజ్ చేశాడు. ఇందులో టీంలో దాదాపుగా ప్రతి ఒక్కరినీ కొనియాడాడు. చివరికి లిరికల్ వీడియో చేసిన సంస్థ ప్రతినిధుల పేర్లు కూడా ప్రస్తావించి ప్రశంసలు కురిపించాడు. కానీ ఎక్కడా నిర్మాత పేరు మాత్రం ఎత్తలేదు. దీన్ని బట్టే దానయ్య పేరుకు నిర్మాతే తప్ప.. ఆయనకు ఈ సినిమాతో వచ్చిన పేరేమీ లేదన్నది స్పష్టం.