రాజమౌళీ సెక్యూరిటీ పెంచుకో.. చంపేస్తాం

రామ్ గోపాల్ వర్మ ట్వీట్లను జనాలు సీరియస్‌గా తీసుకోవడం ఎప్పుడో మానేశారు. రాత్రి సిట్టింగ్‌లో కూర్చుని ఎవరో ఒకరి మీద రాయి వేయడం.. లేదా ఎవరినో ఒకరిని ఇష్టానుసారం పొగడ్డం వర్మకు అలవాటు. ఇంతకుముందులా జనాలు తన ట్వీట్లను పట్టించుకోకపోయినా.. వాటి మీద పెద్దగా డిస్కషన్లు లేకపోయినా వర్మ మాత్రం ఆగట్లేదు. ఎలాగైనా జనాల దృష్టిని ఆకర్షించాలని కొంచెం సెన్సేషనల్ స్టయిల్లో ట్వీట్లు వేస్తూనే ఉంటాడు. తాజాగా రాజమౌళిని ఉద్దేశించి అలాగే ట్వీట్లు వేశాడు వర్మ.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చాలా ఎగ్జైట్ అవుతూ.. రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోపై వర్మ స్పందిస్తూ.. రాజమౌళిని తనదైన శైలిలో కొనియాడాడు. ఈ క్రమంలోనే రాజమౌళి సెక్యూరిటీ పెంచుకోవాలని, లేదంటే చంపేస్తామని వర్మ హెచ్చరించడం గమనార్హం.

“దాదా సాహెబ్ ఫాల్కే దగ్గర్నుంచి ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో ఎస్.ఎస్.రాజమౌళిని కలుపుకుని ఎవ్వరూ కూడా ఒక భారతీయ దర్శకుడికి ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించి ఉండరు. రాజమౌళీ.. మొఘల్-ఎ-అజామ్ తీసిన కాసిఫ్ నుంచి షోలే తీసిన రమేష్ సిప్పీ నుంచి ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, భన్సాలీ లాంటి ఎంతోమంది దర్శకులను మీరు దాటేశారు. అందుకే మీ కాలి బొటన వేలిని నేను చప్పరించాలనుకుంటున్నా. రాజమౌళి సార్.. దయచేసి మీ సెక్యూరిటీని పెంచుకోండి. ఎందుకంటే ఇండియాలో చాలామంది ఫిలిం మేకర్స్ మీ మీద అసూయతో రగిలిపోతున్నారు. అందుకే మిమ్మల్ని చంపడానికి ఒక గ్రూప్ కూడా ఏర్పాటు చేశారు. అందులో నేను కూడా బాగమే. నేను నాలుగు పెగ్గులు వేశాను. కాబట్టే ఈ రహస్యాన్ని బయటపెట్టేస్తున్నా” అంటూ వర్మ వరుసబెట్టి ట్వీట్లు గుప్పించాడు.