ఇక్కడ ఇన్ని సినిమాలు చేస్తూ.. అక్కడ కూడా

తెలుగులో ప్రస్తుతం సినిమాల సంఖ్య, వాటి స్కేల్ పరంగా చూస్తే అతి పెద్ద నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనే చెప్పాలి. ఈ సంక్రాంతికి ఒకేసారి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి భారీ చిత్రాలను రిలీజ్ చేసిందంటే ఆ సంస్థ జోరెలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆ సంస్థ జోరు ముందు దిల్ రాజు సైతం కొంచెం వెనుకబడుతున్నాడంటే వారి దూకుడు ఎలా సాగుతోందో తెలిసిపోతుంది. చిన్న, పెద్ద, మీడియం.. ఇలా రకరకాల రేంజిల్లో సినిమాలు నిర్మిస్తూ దూసుకెళ్తోంది మైత్రీ సంస్థ.

ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప-2’ లాంటి క్రేజీ ప్రాజెక్టుతో పాటు మరి కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రీ.. మలయాళంలో కూడా ఓ క్రేజీ సినిమా చేస్తుండడం విశేషం. ప్రస్తుతం మాలీవుడ్లో మంచి ఊపు మీదున్న యువ కథానాయకుడు టొవినో థామస్‌తో మైత్రీ వాళ్లు సినిమా తీస్తున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా లాంచ్ చేశారు.

నడికర్ తిలగం.. మైత్రీ వారి తొలి మలయాళ సినిమా టైటిల్ ఇది. అంటే నట తిలకం అని అర్థం. తమిళంలో లెజెండరీ నటుడు శివాజీ గణేషన్‌కు ఇదే బిరుదు ఉండేది. ‘మహానటి’ తమిళ వెర్షన్‌కు ఈ పేరే పెట్టారు.

ఇప్పుడు మలయాళంలో ఈ పేరు పెట్టి మైత్రీ వాళ్లు ఒక వయొలెంట్ సినిమా తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఫస్ట్ లుక్‌లో శిలువ వేసి ఉన్న హీరోను వయొలెంట్‌గానే చూపించారు. ఈ చిత్రాన్ని అక్కడి స్టార్ డైరెక్టర్లలో ఒకడైన లాల్ జూనియర్ రూపొందిస్తున్నాడు.

అతను ‘డ్రైవింగ్ లైసెన్స్’ లాంటి సూపర్ హిట్ తర్వాత తీస్తున్న సినిమా ఇది. టొవినో, లాల్ లాంటి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అక్కడ మంచి అంచనాలే ఉన్నట్లున్నాయి. ఈ సినిమా అంచనాలకు తగ్గ విజయం అందుకుంటే మలయాళంలో మైత్రీ వారి నుంచి మరిన్ని సినిమాలు రాబోతున్నట్లే. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.