దేవి ఖాతాలో మరో 100 మిలియన్లు

పనైపోయిందని కామెంట్స్ వచ్చిన ప్రతిసారి దేవిశ్రీ ప్రసాద్ కంబ్యాక్ మాములుగా ఉండటం లేదు. గత కొంత కాలంగా సుకుమార్ తో పని చేసే సినిమాలకు తప్ప మిగిలినవాటికి ఆశించిన స్థాయిలో ఆల్బమ్స్ ఇవ్వడం లేదని విమర్శలు ఎదురుకుంటున్న దేవికి ఈ సంక్రాంతి రూపంలో పెద్ద పరీక్షే ఎదురయ్యింది. అతి పెద్ద కాంపిటీటర్ తమన్ ఒకేసారి వీరసింహారెడ్డి, వారసుడుతో రంగంలో దిగగా తను మాత్రం చిరంజీవికి ఖచ్చితంగా హిట్టు దక్కాల్సిన కీలకమైన సమయంలో వాల్తేరు వీరయ్యని సవాల్ గా తీసుకున్నాడు. పెద్దగా అంచనాలు పెట్టుకోకపోవడమే దేవికి వరంగా మారి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేసింది.

సినిమాలో అయిదు పాటలకు కలిపి మొత్తం 100 మిలియన్ వ్యూస్ దాటించేసిన దేవి మాస్ ఆడియన్స్ లో తనకెంత పట్టుందో మరోసారి నిరూపించాడు. వీటిలో ఒక్క బాస్ పార్టీనే సింహ భాగం తీసుకుని 51 మిలియన్ల వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో చోటు దక్కించుకుంది. పూనకాలు లోడింగ్ 19, శ్రీదేవి చిరంజీవి 13. టైటిల్ సాంగ్ 9.4, నీకేమో అందమెక్కువ 9.1 మిలియన్లతో తర్వాతి ప్లేసులు తీసుకున్నాయి. పుష్ప పార్ట్ 1 ది రైజ్ తర్వాత ఆ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇదే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సైతం ప్రేక్షకుల నుంచి విమర్శకుల దాకా మంచి ప్రసంశలు దక్కిన సంగతి తెలిసిందే.

ఈ జోష్ ని కొనసాగించే ఊపులో ఉన్నాడు దేవి. నెక్స్ట్ చేతిలో పుష్ప 2 ది రూల్ ఉంది. ఫస్ట్ పార్ట్ ని మించిన ట్యూన్స్ ఇవ్వాలనే అంచనాలు ఫ్యాన్స్ లో విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా సామీ సామీ, ఊ అంటావా ఊహూ అంటావాలను తలదన్నే పాటలను కంపోజ్ చేసినట్టు ఆల్రెడీ టాక్ ఉంది. వచ్చే ఏడాది భారీ ఎత్తున విడుదల కాబోతున్న పుష్ప 2తో సైతం మెప్పిస్తే దేవి కెరీర్ కి కొత్త ఊపొస్తుంది. చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్టు ప్రస్తుతానికి ఇదొక్కటే. దర్శకుడు బాబీ కొత్త సినిమా ఓకే అయితే దానికీ అవకాశం రావొచ్చు కానీ అది కన్ఫర్మ్ కావడానికి ఇంకో రెండు మూడు నెలలు సమయం పట్టేలా ఉంది.