జక్కన్న మహాభారతం.. ప్రపంచం సిద్ధం

తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారత గాథ అని దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో ఏళ్ల కిందటే ప్రకటించాడు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలను ‘మహాభారతం’ తీయడానికి ముందు తనకు తాను పెట్టుకుంటున్న పరీక్షలా.. ఒక ట్రయల్‌ లాగా చెబుతూ వస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాలను చూశాక రాజమౌళికి ‘మహాభారతం’ తీయడం అంత కష్టమేమీ కాదని.. ఒకవేళ అది చాలా కష్టమైనా కూడా సాధించగలడని అందరూ నమ్ముతున్నారు.

ఇప్పటికే భారతీయ వెండితెరపై, బుల్లితెరపై మహాభారత గాథను చూసినప్పటికీ.. జక్కన్న మెగా విజన్‌తో ఆ కథను తెరపై చూడడానికి ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఐతే బాహుబలి చేయడానికి ముందు.. ‘మహాభారతం’ తీయడానికి తనకు ఇంకో పదేళ్ల అనుభవం అవసరం అవుతుందని జక్కన్న చెప్పాడు. కానీ ఆ పదేళ్లు పూర్తవడానికి సమయం దగ్గర పడుతున్నా మహాభారతం ఊసు ఎత్తట్లేదు.

ఐతే ఈ మెగా ప్రాజెక్టు ఆలస్యం అయితే అయింది కానీ.. దాని వల్ల ఒక మంచి జరిగిందని చెప్పాలి. ఇప్పటిదాకా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టును తెరపై చూడడానికి భారతీయ ప్రేక్షకులు మాత్రమే ఎగ్జైట్ అవుతూ వచ్చారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జక్కన్న ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. హాలీవుడ్ ప్రేక్ష్ఖకులు సైతం ఆయన పేరెత్తితే ఊగిపోతున్నారు. భారతీయులంతా ఎంతో గర్వించే మహాభారత కథను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల వాళ్లు ఆదరించడానికి అవకాశం దక్కింది.

బేసిగ్గా మహాభారత కథలోనే గొప్ప విషయం ఉంది. అందులో క్యారెక్టర్లు, ఉపకథలు, మలుపులు అద్భుతం అనే చెప్పాలి. అలాంటి కథను రాజమౌళి తన విజన్‌తో భారీ స్థాయిలో తెరకెక్కిస్తే దేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది. ప్రపంచం కూడా ఆ కథలోని గొప్పదనాన్ని అర్థం చేసుకుంటుంది. రాజమౌళి మార్కెట్ అసాధారణ స్థాయిలో విస్తరించిన నేపథ్యంలో ఆ సినిమా కలెక్షన్లకు ఆకాశామే హద్దు అవుతుంది. కొన్ని భాగాలుగా తెరకెక్కే ఆ సినిమాను పూర్తి చేస్తే జక్కన్న కెరీర్‌కు అంతకుమించి సార్థకత లేకపోవచ్చు. మహేష్ బాబు సినిమా అవ్వగానే ఈ మెగా ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని ఆశిద్దాం.