‘అన్‌స్టాపబుల్‌’కు రోజా వెళ్లదు.. ఎందుకంటే?

తెలుగు టాక్ షోల్లో ‘అన్ స్టాపబుల్’ ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. అంతకుముందు తెలుగులో ఎన్నో టాక్ షోలు ఆదరణ పొందాయి కానీ.. ఇది వేరే లెవెల్‌కు వెళ్లిపోయింది. కేవలం ఈ షో వల్ల యూత్‌లో, ఈ తరం ప్రేక్షకుల్లో బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అంటే దాని ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండో సీజన్‌లో చంద్రబాబు నాయుడు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి విశిష్ఠ వ్యక్తులు ఈ షోకు అతిథులుగా రావడంతో దీని రేంజ్ ఇంకా పెరిగింది.

మరి ఇలాంటి షోలో మీరు ఎప్పుడు పాల్గొంటారు అని ఒకప్పటి నటి, ప్రస్తుత మంత్రి రోజాను అడిగితే.. ఆ షోకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చేసింది. గతంలో ఈ షో ప్రస్తావన వచ్చినపుడు.. ‘అన్‌స్టాపబుల్’కు తాను వెళ్తే తన గురించి రకరకాల ప్రచారాలు చేస్తారన్న ఉద్దేశంతో వెళ్లలేదని చెప్పిన రోజా.. ఇప్పుడు మరో రకంగా మాట్లాడింది.

గతంలో అయితే అన్‌స్టాపబుల్‌ షోకి వెళ్లాలని ఆశగా ఉండేదని, ఎందుకంటే బాలకృష్ణతో కలసి ఏడు సినిమాలు చేశానని, బాలయ్యది తనది హిట్‌ కాంబినేషన్ అని రోజా చెప్పింది. తనను రెండు సార్లు ఈ షోకు పిలిచారని, కానీ కరెక్ట్‌గా వాళ్లు పిలిచిన టైమ్‌లో తనకు అసెంబ్లీ సెషన్స్‌ జరుగుతుండడంతో వెళ్లలేకపోయారనని రోజా తెలిపింది.

ఐతే ఇటీవల బాలకృష్ణ, చంద్రబాబు కలిసి చేసిన ఎపిసోడ్ చూశాక జీవితంలో ఈ షోకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు రోజా తెలిపింది. తెలుగుదేశం వ్యవస్థాపకులైన ఎన్టీ రామారావు విషయంలో బాలయ్య, చంద్రబాబు మాట్లాడిన తీరు చూశాక మరీ దారుణం అనిపించిందని.. ఇలాంటి షోకు మనం ఎలా వెళ్తాం అనుకున్నానని.. తాజాగా పవన్‌ కళ్యాణ్‌తోనూ బాలయ్య ఎపిసోడ్ చేస్తున్నట్లు తెలిశాక పూర్తిగా ఆ షోకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఆమె పేర్కొంది.