టికెట్ రేట్లు పెంచడమంటే ఇదా

వందల కోట్ల పెట్టుబడితో నిర్మించిన భారీ సినిమాలకు ఆ మొత్తం వెనక్కు రావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ రేట్ల పెంపు అనేది తప్పనిసరిగా మారిపోతోంది. ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఒకదానితో మరొకటి పోల్చలేని విధంగా ఉండటంతో నిర్మాతల ఇబ్బంది అంతా ఇంతా కాదు. తెలంగాణలో ఎలాంటి సమస్య లేదు. మొదటి రోజు ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చారు. మల్టీప్లెక్సుల్లో గరిష్టంగా 295 రూపాయలు పెట్టుకునే వెసులుబాటు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ త్వరగా మొదలుపెట్టానికి అవకాశం దొరికింది.

ఎటొచ్చి ఏపీలోనే పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఎక్స్ ట్రా షోలకు సంబంధించి సరైన క్లారిటీ లేదు. టికెట్ పెంపు ముందు 45 రూపాయలన్నారు. ఆ తర్వాత లేదు లేదు 25 ఫిక్స్ అని వినిపించింది. వీరసింహారెడ్డికి ఇంకో అయిదు తక్కువట అంటే 20. ఇదేం చోద్యమో మరి. పోనీ వాటికైనా జీవో ఉత్తర్వులు వెంటనే వచ్చాయా అంటే అదీ లేదు. రిలీజ్ కు కేవలం కొద్దిగంటల ముందు ఇలా చేయడం వల్ల ప్రొడ్యూసర్లే కాదు మొత్తం డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. ఆఖరి నిమిషం దాకా సాగదీయడం వల్ల ముందే టికెట్లు అమ్ముకోలేక తీరా ఆట సమయం మొదలయ్యే టైంకి ఒత్తిడి తట్టుకోలేక నానా అగచాట్లు పడాల్సి ఉంటుంది.

ఇంతా చేసి కేవలం పాతిక రూపాయలు మాత్రమే పెంచుకోండని చెబితే ఇదెక్కడి న్యాయమంటున్నారు ఎగ్జిబిటర్లు. కనీసం ఒక వారం ఎక్కువ ధరలకు వెసులుబాటు ఇస్తేనే గట్టెక్కుతామని లేదంటే రిస్క్ లో పడతామని మొత్తుకుంటున్నారు. అసలు సినిమాకైన బడ్జెట్ లు చూసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది కానీ గుడ్డిగా ఏదో సామాన్యుడికి గొప్ప మేలు చేస్తున్నామనే భ్రమను కలిగించే ఇలాంటి చర్యల వల్ల ఏం ప్రయోజనం ఉండదని వాపోతున్నారు. ఆంధ్రాలో బిసి సెంటర్స్ లో టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నాయి. అలాంటపుడు కంటితుడుపుగా ఇచ్చే హైక్ వల్ల పెద్దగా ఉపయోగముండదనే లాజిక్ లో నిజం లేకపోలేదు.