చెంఘీజ్ ఖాన్ బాలయ్య చేయాల్సిన సినిమానే

ప్రతి హీరోకు కొన్ని డ్రీం ప్రాజెక్ట్స్ ఉంటాయి. అనుకున్నంత ఈజీగా అవి నెరవేరవు, స్వర్గీయ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు చేయాలని ఎంతో తపించి స్క్రిప్ట్ కూడా రాయించారు. కానీ ఆలస్యమైపోవడంతో కృష్ణ రిస్క్ చేసి తీసేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమా చూశాక అన్నగారు మళ్ళీ ఆ ఆలోచన చేయలేదు. ఎప్పటి నుంచో అనుకుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా కనిపించాలని కలలు కన్న చిరంజీవికి అది నెరవేరడానికి నలభై ఏళ్ళు పట్టింది. ఛత్రపతి శివాజీ వేషం వేయాలని లెజెండరీ యాక్టర్స్ ఎందరో అనుకున్నా పూర్తి స్థాయి చిత్రంగా మలచలేకపోయారు.

కృష్ణంరాజు గారికి భక్త కన్నప్ప అంటే ఎంత మక్కువో తెలియంది కాదు. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం నిన్న జరిగిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ ఎప్పటికైనా చెంఘీజ్ ఖాన్ కథను తెరకెక్కించాలనే జీవితాశయాన్ని వ్యక్తం చేశారు. పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ మంగోలియన్ సామ్రాజ్య స్థాపకుడి గాథలో ఎన్నో వీరోచిత విన్యాసాలు మలుపులు ఉన్నాయి. వీటిని ఇప్పటి తరానికి పరిచయం చేయడం అవసరమే. చెంఘీజ్ ఖాన్ మీద తెలుగులోనూ బోలెడు సాహిత్యం అందుబాటులో ఉంది. సరిగ్గా దృష్టి పెడితే ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ వస్తుంది.

కాకపోతే సరైన దర్శకుడి కాంబినేషన్ నిర్మాత సెట్ కావాలి. గౌతమిపుత్రశాతకర్ణి, మణికర్ణిక, హరిహరవీరమల్లు లాంటి చారిత్రాత్మక చిత్రాలను డీల్ చేసిన క్రిష్ ఒక్కడే బెటర్ ఛాయస్ గా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చేదు అనుభవాన్నే మిగిల్చినా తన టేకింగ్ మీద బాలయ్య నటన మీద విమర్శలేం రాలేదు. సో మళ్ళీ ఈ కలయికకు ఛాన్స్ ఉంది. గతంలో నర్తనశాలను సౌందర్య మరణంతో ఆపేసిన బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్ ని వచ్చే ఏడాది మొదలుపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ చెంఘీజ్ ఖాన్ ని నిజంగా ప్లాన్ చేసుకుంటే మంచి ఊపుమీదున్న ఈ టైంలోనే చేస్తే బెటర్.