సంక్రాంతికి దిల్ రాజు నుంచి మరో సినిమా?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజును.. ఈ సంక్రాంతికి సరికొత్తగా చూడబోతున్నాం. ఎప్పుడూ ఈ పండక్కి రిలీజయ్యే పెద్ద తెలుగు సినిమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో్ని ప్రధాన ఏరియాల్లో తనే రిలీజ్ చేస్తూ ఉంటాడు రాజు. సంక్రాంతి తెలుగు సినిమాల్లో హీరోలు ఎవరైనా, వాటిని నిర్మించిన సంస్థలు ఏవైనా.. నైజాం, వైజాగ్ లాంటి ఏరియాల్లో రాజు బేనర్ నుంచే రిలీజ్ కావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సొంతంగా నిర్మించి తెలుగు చిత్రాలను కూడా సంక్రాంతి రేసులో నిలుపుతుంటాడు రాజు.

ఐతే 2023 సంక్రాంతికి మాత్రం భిన్నమైన దృశ్యం చూడబోతున్నాం. ఈ పండక్కి షెడ్యూల్ అయిన చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లతో రాజుకు ఎలాంటి సంబంధం ఉండబోదు. ఏ ఏరియాలకు కూడా వాటి హక్కులు తీసుకోలేదు రాజు. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టి ఈ చిత్రాలను రిలీజ్ చేసుకుంటున్నారు.

రాజు తన నిర్మాణంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వారిసు’ను తెలుగులో కొంచెం పెద్ద స్థాయిలో రిలీజ్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు అంతగా డిమాండ్ లేకపోయినా ఎక్కువ థియేటర్లు ఇచ్చుకుంటుండడంపై రాజు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా ఆయన ఈ పండక్కి మరో డబ్బింగ్ సినిమాను కూడా తన బేనర్ మీద రిలీజ్ చేయబోతున్నాడట. అదే.. తెగింపు.

అజిత్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘తునివు’కు ఇది తెలుగు వెర్షన్. ఈ చిత్ర హక్కులను ముందు వేరే సంస్థేదో దక్కించుకుందని వార్తలొచ్చాయి. కానీ చేతులు మారి రాజు బేనర్ ద్వారా ‘తెగింపు’ రిలీజ్ కానుందట. ఈ చిత్రం సంక్రాంతి రేసులో అన్నింటికంటే ముందు 11న రిలీజ్ కానుంది. మరుసటి రోజు వీరసింహారెడ్డి, వారసుడు.. 13న వాల్తేరు వీరయ్య వస్తాయి. 11న ‘తెగింపు’కు అసలు పోటీయే లేదు. ఆ ఒక్క రోజు ఆ చిత్రానికి కావాల్సినన్ని స్క్రీన్లు, షోలు దక్కుతాయి. ఈ చిత్ర హక్కులు రూ.3 కోట్లకే ఇచ్చేశారట. మంచి పబ్లిసిటీ చేసి ప్లానింగ్‌తో రిలీజ్ చేస్తే ఆ ఒక్క రోజులోనే సినిమా లాభాల బాట పట్టొచ్చు. అందుకే రాజు సినిమా చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది.