సౌత్ సినిమా గురించి నోరు జారిన రష్మిక మందన్న

ఈ మధ్య మన సౌత్ హీరోయిన్లకు Bollywood అంటే చాలు ఏదో తెలియని పూనకం వచ్చేస్తోంది. ఒక పక్క వాళ్లే మనవెంట పడుతుంటే ఇక్కడ రివర్స్ లో హిందీ సినిమాలు చేయాలనే తాపత్రయంలో ఏవేవో మాట్లాడేస్తూ లేనిపోని విమర్శలకు అవకాశమిస్తున్నారు. ఇటీవలే అమితాబ్ బచ్చన్ గుడ్ బైతో హిందీ డెబ్యూ చేసిన రష్మిక మందన్న తర్వాతి సినిమా మిషన్ మజ్ను విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చేస్తున్న ప్రమోషన్ ఈవెంట్స్ లో చురుకుగా పాల్గొంటోంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ యాక్షన్ కం రొమాంటిక్ థ్రిల్లర్ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని డైరెక్ట్ ఓటిటి ప్రీమియర్ కు రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ అసలు రొమాంటిక్ అంటేనే బాలీవుడ్ అని, దక్షిణాది చిత్రాల్లో మసాలా అంశాలు ఐటెం సాంగ్స్ ఎక్కువగా ఉంటాయని అందుకే మొదటిసారి అలాంటి సాంగ్ చేస్తున్నందుకు తెగ ఎగ్జైట్ మెంట్ గా ఉందని ఓ రేంజ్ లో యాక్టింగ్ చేసి మరీ చెప్పేసింది. సరే నటించిన సినిమా కాబట్టి దాన్ని పొగడటంలో తప్పు లేదు. కానీ అకారణంగా తన మూలాలు ఉన్న పరిశ్రమలను మర్చిపోతే ఎలా. తనకు లైఫ్ ఇచ్చింది శాండల్ వుడ్. నటిగా బంగారం లాంటి కెరీర్ ఇచ్చింది టాలీవుడ్. కోలీవుడ్ నుంచి విజయ్ లాంటి స్టార్ హీరో ఆఫర్ వారసుడు రూపంలో దక్కింది. మళయాలంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి.

చరిత్ర పట్ల అవగాహన లేకపోతే అసలు ఆ ప్రస్తావనే తేకుండా ఉండాల్సింది. అంతే తప్ప సౌత్ ఎప్పుడూ మూసలోనే ఉంటుందనే ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వడం చూస్తే ఇంతకీ Rashmika బాలచందర్, భారతిరాజా, కె విశ్వనాథ్, మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్లు తీసిన ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ చూసిందో లేదో అనే అనుమానం వస్తోంది. మాస్ అనేది ఎక్కడైనా ఉంటుంది. అమితాబ్, మిథున్, శత్రుజ్ఞ సిన్హా లాంటి వాళ్ళు చేయలేదా. అసలు ఐటెం సాంగ్స్ ని ట్రెండ్ గా మార్చిందే అమితాబ్ బచ్చన్ డాన్ సినిమా. ఆ మధ్య ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతోనే కన్నడ ప్రియుల ఆగ్రహానికి గురైన రష్మిక మందన్న ఇప్పుడు అందరికీ టార్గెట్ అయిపోయింది.