పాతికేళ్ల సంక్రాంతి రిపీట్ అవుతుందట

ఒకే పండక్కు పోటీ పడే విషయంలో హీరోల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కానీ ఫ్యాన్స్ మాత్రం వాటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అందుకే థియేటర్ల పంపకాలతో మొదలుకుని ఓపెనింగ్ షేర్లు, క్లోజింగ్ ఫిగర్లంటూ చివరి రోజు దాకా వీళ్ళ హంగామా మాములుగా ఉండదు. ఇక రేస్ లో చిరంజీవి బాలకృష్ణ లాంటి టాప్ స్టార్లు ఉంటే చెప్పదేముంది. ఈసారి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు సంబంధించి ఎలాంటి వాతావరణం ఏర్పడిందో చూస్తున్నాం. రెండూ ఒకే బ్యానర్ కావడం, అవతల దిల్ రాజు తన వారసుడు కోసం పెద్ద స్కెచ్ ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ ఒక రకమైన టెన్షన్ ని సృష్టిస్తున్నాయి.

ఇదంతా చిరు బాలయ్యలకు కొత్త కాదు. చాలాసార్లు తలపడ్డారు. ఒక్కోసారి ఒక్కొక్కరిది పై చేయి అయ్యింది. 2017లో ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణిలు రెండూ విజయం సాధించాయి. కమర్షియల్ లెక్కల్లో చిరుది డామినేషన్ అయ్యింది. అయితే ఇద్దరి అభిమానులకు మాత్రం 1997 సంక్రాంతి స్పెషల్ గా నిలుస్తుంది. ఎందుకంటే ఆ టైంలో చిరు కంబ్యాక్ మూవీ హిట్లర్, బాలయ్య విలేజ్ మసాలా డ్రామా పెద్దన్నయ్య కేవలం రోజుల గ్యాప్ తో తలపడ్డాయి. కంటెంట్ రెండింట్లోనూ దేనికవే తీసిపోని రీతిలో ఉండటం ఆదరణ పొందాయి. అదే రేస్ లో ఉన్న వెంకటేష్ చిన్నబ్బాయి డిజాస్టర్ కావడం వేరే విషయం.

ఇప్పుడీ ప్రస్తావన వీరయ్య ప్రెస్ మీట్ లో వచ్చింది. పాతికేళ్ల క్రితం ఏదైతే జరిగిందో ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతుందని కావాలంటే రాసిపెట్టుకోండని నొక్కి మరీ చెప్పేశారు చిరంజీవి. థియేటర్ల గొడవ గురించి మాట్లాడుతూ అది నిర్మాతలకు సంబంధించిన వ్యవహారమని రెండూ వాళ్ళ బిడ్డలే కాబట్టి ఒక కన్ను పొడుచుకునేలా వ్యవహరించరని చెప్పి ఆ ఇష్యూ ని స్మార్ట్ గా సైడ్ చేశారు. ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ టైపు లో చాలా సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో అన్నీ ఇప్పుడే మాట్లాడేస్తే అసలు టైంలో ఇంకేం ఉండవని చెప్పి రవితేజ తెలివిగా ముక్తాయించి తప్పుకోవడం ఫైనల్ ట్విస్ట్.