ప్రభాస్ పవన్ ఆహా అనిపిస్తారా

ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ అయ్యాక అంతకన్నా ఎక్కువ జోష్ తో బాలకృష్ణ నడిపిస్తున్న ఆన్ స్టాపబుల్ షోకు సంబంధించి ఇప్పటిదాకా పలు ఎపిసోడ్లు పూర్తయినా ఏదీ మరీ గొప్పగా చెప్పుకునే స్థాయిలో రిజిస్టర్ అవ్వలేదు. సెలబ్రిటీల కొరతతో ఈసారి పొలిటికల్ టచ్ ఇవ్వడం రాజకీయ వర్గాలకు ఆసక్తి రేపింది కానీ సగటు ఆడియన్స్ ఆశిస్తోంది మాత్రం కేవలం తారలనే. అందుకే ఈసారి భారీ స్కెచ్ వేసి ఏకంగా ప్రభాస్ తీసుకురావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ప్రోమోలతోనే ఓ రేంజ్ లో రచ్చ జరుగుతోంది. డార్లింగ్ మునుపటి ఎనర్జీని కామెడీ టైమింగ్ ని చూసి ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.

ఇది ఈ నెల 30న ప్రీమియర్ కాబోతున్న సంగతి తెలిసిందే. దానికన్నా ముందు 27న పవన్ కళ్యాణ్ తో బాలయ్య ములాఖత్ ని షూట్ చేయబోతున్నారు. పవర్ స్టార్ తో పాటు త్రివిక్రమ్ వస్తారా లేక క్రిష్ హాజరవుతారా లేక ముగ్గురూ ఉంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అరుదైన కాంబోగా దీని మీద అప్పుడే సోషల్ మీడియా బజ్ పెరుగుతోంది. జనసేన అధ్యక్షుడిగా పవర్ స్టార్ గా చిరంజీవి తమ్ముడిగా దేని మీద ఎక్కువ ప్రశ్నలు ఉంటాయనే విపరీతమైన ఆసక్తి పెరుగుతోంది. పైగా టిడిపి పొత్తు గురించి కూడా ఏమైనా టాపిక్ వస్తుందేమోననే వెయిట్ చేస్తున్నవాళ్ళు లేకపోలేదు.

ఆహాకు ఈ రెండు కలయికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. కొత్త సినిమాల హక్కులను కొని స్ట్రీమింగ్ చేసే విషయంలో ఆహా మునుపటిలా దూకుడు చూపించలేకపోతోంది. ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ హాట్ స్టార్ లకి పోటీ ఇవ్వడం సవాల్ గా మారిపోయింది. అందుకే కేవలం మూవీస్ ని నమ్ముకుంటే లాభం లేదని టాక్ షో రూటు తీసుకుంది. అంతకుముందు ఇలాంటివి ఉన్నాయి కానీ బాలయ్య రేంజ్ లో ఏదీ స్పందన దక్కించుకోలేదన్నది వాస్తవం. కేవలం దీని కోసం సబ్స్క్రిప్షన్ తీసుకునే ప్రభాస్ పవన్ ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ ఉంటారు. సీజన్ 3ని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో క్లోజ్ చేయొచ్చని మరో టాక్.