రెండు ఫ్లాప్ లు ఇచ్చినా తగ్గేదేలే..

దర్శకుడిగా రాధాకృష్ణ కుమార్ తొలి చిత్రం ‘జిల్’కు మంచి సమీక్షలు, టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర ఆ చిత్రం నిలబడలేదు. కాస్త బడ్జెట్ కూడా ఎక్కువైపోవడం సమస్యగా మారి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. అయినా సరే.. ‘బాహుబలి’ తర్వాత శిఖర స్థాయి ఇమేజ్‌ను అందుకున్న ప్రభాస్‌తో వందల కోట్ల సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడతను.
ప్రభాస్ అంటే అందరూ మాస్, యాక్షన్ సినిమాలే తీయాలని చూస్తారు కానీ.. రాధాకృష్ణ మాత్రం అంచనాలకు భిన్నంగా ఒక ప్రేమకథను తెరకెక్కించాడు. కానీ వీరి కలయికలో వచ్చిన ‘రాధేశ్యామ్’లో విషయం తక్కువ, హడావుడి ఎక్కువ అన్నట్లు తయారైంది. అసలు విషయం మీద దృష్టిపెట్టకుండా హంగులు ఎన్ని జోడిస్తే ఏం లాభం? సినిమా పెద్ద డిజాస్టర్ అయి కూర్చుంది. రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి ఫలితం తర్వాత దర్శకుడికి మరో అవకాశం దక్కడం కష్టమే.

‘రాధేశ్యామ్’ విడుదలై తొమ్మిది నెలలు దాటినా రాధాకృష్ణ తర్వాతి సినిమా గురించి అసలు సౌండ్ లేదు. ఐతే ఇటీవల తన నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. అతను ఈసారి తమిళ స్టార్ హీరో ధనుష్ మీద దృష్టిపెట్టినట్లు సమాచారం. అతడి కోసం ఒక యాక్షన్ స్టోరీని రెడీ చేసి వినిపించాడట. ధనుష్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. ధనుష్ తన మార్కెట్‌ను విస్తరించే క్రమంలో ఇప్పటికే తెలుగులో వెంకీ అట్లూరితో ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత శేఖర్ కమ్ముల సినిమా కూడా లైన్లో ఉంది. ఇప్పుడు రాధాకృష్ణతోనూ సినిమా ఓకే చేస్తే విశేషమే అవుతుంది.

రాధాకృష్ణ తొలి రెండు చిత్రాలను నిర్మించిన యువి క్రియేషన్సే ఈ ప్రాజెక్టును సెట్ చేస్తున్నట్లు సమాచారం. ‘రాధేశ్యామ్’ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా రాధాకృష్ణను నమ్మి యువి వాళ్లు అతడితో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే విశేషమే.