షారుఖ్‌కు ముస్లిం బోర్డు షాక్

షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘పఠాన్’ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘బేషారమ్ రంగ్’ అనే పాట మీద హిందూ అనుకూల వర్గాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పాట చిత్రీకరణ చాలా అసభ్యంగా ఉందంటూ న్యూట్రల్ జనాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీపికా పదుకొనే డ్రెస్సింగ్, ఎక్స్‌పోజింగ్, హావభావాలు హద్దులు దాటిపోయాని చాలామంది విమర్శలు చేశారు. కాగా బీజేపీ అనుకూల వర్గాలేమో.. ఆమె కాషాయం ధరించి ఎక్స్‌పోజింగ్ చేయడాన్ని తప్పుబట్టడం కొంచెం విడ్డూరంగా అనిపించింది.

ఇంతలో ఆ పార్టీని వ్యతిరేకించే లిబరల్స్ అందరూ ఒక్కటై ‘పఠాన్’ టీంకు బాసటగా నిలిచారు. ఈ వివాదం మీద జోరుగా చర్చ నడుస్తుండగా.. షారుఖ్ ఖాన్‌కు ఇప్పుడో పెద్ద షాక్ తగిలింది. హిందూ వర్గాలు షారుఖ్ సినిమాను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ముస్లిం సంఘాలు ఆయనకు బాసటగా నిలుస్తాయనుకుంటే.. సీన్ రివర్సయింది.

‘బేషారమ్ రంగ్’ పాట మీద మధ్యప్రదేశ్‌కు చెందిన ఉలేమా బోర్డు తీవ్ర అభ్యంతరం తెలిపింది. సినిమాకు ‘పఠాన్’ పేరు పెట్టి అందులో చాలా అభ్యంతరకరమైన విషయాలు చూపిస్తున్నారని ఆ బోర్డు విమర్శించింది. పఠాన్లు చాలా గౌరవంగా ఉంటారని, వారిది అత్యంత గౌరవమైన సమాజమని, అయితే ఈ సినిమాలో వారిని చాలా అభ్యంతకరంగా చూపించారంటూ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ సినిమాను విడుదల కాకుండా ఆపాలని, లేని పక్షంలో సినిమాలోని అశ్లీల దృశ్యాలను తెరపై కనిపించకుండా కత్తిరించాలని డిమాండ్ ఆ బోర్డు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సినిమాను ఆల్ ఇండియా ముస్లిం ఫెస్టివల్ కమిటీ బహిష్కరించిందని ఉలేమా బోర్డు అధ్యక్షుడు సయ్యద్ అనాస్ అలీస్ పేర్కొన్నారు. ఇటు హిందూ వర్గాలు సినిమాను బహిష్కరించాలని పిలుపునిస్తుండగా.. ఇప్పుడు ముస్లిం బోర్డు ప్రతినిధి సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో ‘పఠాన్’ భవితవ్యం ఏమవుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.